విశాఖలో రూ.21,844 కోట్లతో భారీ పెట్టుబడులు… మే 3న సీఎం భూమి పూజ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేటా సెంటర్, ఐటీ పార్కుల అభివృద్ధి కోసం అదానీ గ్రూపు రూ.21,844 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. మొత్తం 300 మెగావాట్లు సామర్థ్యంతో డేటా సెంటర్తో పాటు బిజినెస్ ఐటీ పార్కు, స్కిల్ కాలేజీ, రిక్రియేషన్ సెంటర్లను అభివృద్ధి చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖపట్నంలోని మధురవాడ సమీపంలో కాపులుప్పాడ వద్ద ఎకరం కోటి రూపాయలు చొప్పున 190.29 ఎకరాలను కేటాయించింది. ఈ డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా 39,815 మందికి ఉపాధి లభించనుంది. తొలుత 130 ఎకరాల్లో 200 మెగావాట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఈ సంస్థ ఆ తర్వాత మరో 100 మెగావాట్ల డేటా సెంటర్ను ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. దీంతో మరో 60.29 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ప్రాజెక్టు కోసం అదానీ గ్రూపు విశాఖ టెక్ పార్క్ లిమిటెడ్ (వీటీపీఎల్) పేరుతో ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేసింది. మే 3న అదానీ గ్రూపు అధికారుల సమక్షంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డేటా సెంటర్ నిర్మాణ పనులకు భూమిపూజ చేయనున్నారు. ఉద్యోగాల కల్పన ఆధారంగానే రాయితీలు, ప్రోత్సాహకాలను ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వీటీపీఎల్తో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం ఐదు దశల్లో ప్రాజెక్టును ఏడు సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా 39,815 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తామని వీటీపీఎల్ సమర్పించిన ప్రాజెక్టు రిపోర్టులో పేర్కొంది.






