ఎపికి మూడున్నరేళ్లలో 194 ఐటీ కంపెనీల రాక
ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీలకు అనుకూలమైన విధానాలను ఏర్పాటు చేయడం వల్ల గత మూడేళ్ళలో 194 ఐటీ కంపెనీలు వచ్చినట్లు ఎపి అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో పలు ఐటీ సంస్థలు విశాఖతో పాటు పలు ద్వితీయ శ్రేణి పట్టణాల్లో తమ కార్యాలయాలను ప్రారంభిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుండటంతో పలు ఐటీ కంపెనీలు భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటిస్తున్నాయి. ఇప్పటివరకు విశాఖకే పరిమితమైన టెక్ మహీంద్రా తాజాగా విజయవాడలో కార్యకలాపాలను ప్రారంభించింది. గన్నవరం మేథా టవర్స్లో 120 సీటింగ్ సామర్థ్యంతో కార్యాలయాన్ని టెక్ మహీంద్రా ప్రారంభించింది. హెచ్సీఎల్ విజయవాడ నుంచి విశాఖకు విస్తరించగా, విశాఖలో ఉన్న డబ్ల్యూఎన్ఎస్, పల్ససెస్ ఐడీఏ లాంటి 30కిపైగా ఐటీ, ఐటీ ఆధారిత సేవల కంపెనీలు విస్తరణ కార్యక్రమాలను చేపట్టాయి.
2019కి ముందు రాష్ట్రంలో ఐటీ కంపెనీల సంఖ్య 178 కాగా, ఇప్పుడవి 372కి చేరుకున్నాయి. మూడున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏకంగా 194 ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. గత ఆర్నెల్ల వ్యవధిలో ఇన్ఫోసిస్, రాండ్ శాడ్, టెక్నోటాస్క్, ఐజెన్ అమెరికా సాఫ్ట్వేర్, టెక్బుల్, కాంప్లెక్స్ సిస్టమ్స్ లాంటి డజనకుపైగా కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటైనట్లు ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ (అపిటా) గ్రూప్ సీఈవో ఎస్.కిరణ్కుమార్రెడ్డి తెలిపారు. కొత్తగా ఏర్పాటైన కంపెనీలు, విస్తరణ ద్వారా అదనంగా 20,000కిపైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు వివరించారు. మరికొన్ని కీలక ఐటీ కంపెనీలతో చర్చలు తుది దశలో ఉన్నట్లు వెల్లడించారు.
2012లో కేవలం 50 మందితో ప్రారంభమైన డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్ ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 3,300 దాటింది. ఇందులో 2,000 మంది ఉద్యోగులు గత రెండేళ్లలోనే చేరినట్లు డబ్ల్యూఎన్ఎస్ సీఈవో కేశవ్ ఆర్ మురుగేష్ వెల్లడిరచారు. 2019లో 40 మందితో ప్రారంభించిన తమ సంస్థ ఉద్యోగుల సంఖ్య 4,200 దాటినట్లు పల్సస్ సీఈవో సీఈవో గేదెల శ్రీనుబాబు తెలిపారు. కొత్తగా ఏర్పాటైన కంపెనీలు, విస్తరణ ద్వారా గత మూడున్నరేళ్లలో రాష్ట్రంలో 23,000 మందికి ఐటీ రంగంలో ఉపాధి లభించింది.






