Donald Trump: ట్రంప్ చేతుల్లోకి వెనెజువెలా పగ్గాలు.. చమురు వ్యాపారంపై కన్ను..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. వెనెజువెలా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించారు. తనకున్న అధికార బలం, సైనిక బలంతో ఆదేశంపై దాడి చేసి.. కేవలం గంటల వ్యవధిలో అధికార పీఠం లాగేశారు. అంతేకాదు.. అధ్యక్ష దంపతులు మదురో, అతని భార్యను.. ఏకంగా అమెరికా కోర్టుల ముందు నిలబెడతామన్నారు ట్రంప్. అయితే .. ట్రంప్ ఇంకో కీలకమైన ప్రకటన చేశారు. ఇక నుంచి వెనెజువెలాను తామే నేరుగా పాలిస్తామన్నారు .
అధికారాల బదిలీ జరిగేదాకా వెనెజువెలాను తామే నడిపిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే అక్కడ అమెరికా ప్రాతినిధ్యం ఉందని తెలిపారు. ‘దేశం సురక్షితమని భావించే వరకూ, సరైన, న్యాయమైన అధికారాల బదిలీ జరిగే వరకూ మా పాలనే ఉంటుంది. అమెరికా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేవారికి, అమెరికా ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేసే వారికి ఇదో హెచ్చరిక. అత్యంత విజయవంతమైన ఆపరేషన్ను నిర్వహించాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. అవసరమైతే వెనెజువెలాపై మరింత పెద్ద దాడి చేస్తామని తెలిపారు.
వెనెజువెలాలో చమురు వ్యాపారం అస్తవ్యస్తంగా ఉందని, అమెరికాలోని పెద్ద కంపెనీలు అక్కడికి వెళ్లి మౌలిక వసతులను కల్పించి దేశం కోసం ఆదాయాన్ని సంపాదిస్తాయని ట్రంప్ వివరించారు. ఈ దాడులను గతంలో ఇరాన్పై చేసిన దాడులతో ట్రంప్ పోల్చారు. శనివారం అమెరికా సాధించిన విజయాన్ని ప్రపంచంలోని ఏ దేశమూ సాధించలేదని స్పష్టం చేశారు.
వెనెజువెలా సైన్యాన్నంతా నిర్వీర్యం చేశామని ట్రంప్ తెలిపారు. లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకునేందుకు దాడుల సమయంలో కారకాస్లో విద్యుత్తును నిలిపేశామని వెల్లడించారు.
మదురోకు మద్దతిచ్చే నేతలను ట్రంప్ హెచ్చరించారు. నియంత, ఉగ్రవాది అయిన మదురో వెళ్లిపోవడంతో వెనెజువెలా ప్రజలకు స్వేచ్ఛ లభించిందని తెలిపారు. ఆ దేశ ప్రజలను సంపన్నులుగా మారుస్తామని వివరించారు. స్వతంత్రంగా బతికేలా చేస్తామని తెలిపారు.






