బంగ్లాదేశ్ లో ఆరని మంటలకు ఆ చిన్నద్వీపమే కారణమా..?
బంగ్లాదేశ్ అల్లకల్లోలం వెనుక అమెరికా హస్తం ఉందని మాజీ ప్రధాని షేక్ హసీనా బాంబు పేల్చారు. సెయింట్ మార్టిన్స్ అనే ద్వీపం కోసం తమ దేశంలో అల్లర్లు సృష్టించి తనను పదవి నుంచి దించేసిందని ఆరోపించారు. ఒక అగ్రరాజ్యానికి ఓ చిన్నదేశం సమీపంలో ఉన్న సెయింట్ మార్టిన్స్ ద్వీపం అవసరమేంటి.? ఈద్వీపం అవసరం లేదని ప్రకటనలుచేస్తూనే.. తెరచాటు ప్రయత్నాలు చేస్తోందా..? అసలు ఈ సెయింట్ మార్టిన్స్ లేదా కోకోనట్ ఐలాండ్ నేపథ్యం పరిశీలిద్దాం..
బంగాళాఖాతంలోని ఈశాన్య భాగంలో దాదాపు 3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సెయింట్ మార్టిన్స్ ద్వీపం ఉంది. ఇది ఒక పగడపు దీవి. బంగ్లాదేశ్ దక్షిణ కొనలో ఉన్న కాక్స్ బజార్కు 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్థానికులు దీనిని నారీకేళ్ జింజిరా, కోకోనట్ ఐలాండ్ అని పిలుస్తారు. ఈ దీవిలో 3,700 మంది ప్రజలు నివాసముంటున్నారు. వీరంతా చేపల వేట, వరి సాగు, కొబ్బరి తోటలపై ఆధారపడి జీవిస్తున్నారు. సీవీడ్ సాగుకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. దీనిని మయన్మార్కు ఎగుమతి చేస్తారు.
18వ శతాబ్దంలో ఇక్కడ అరబ్ వర్తకులు స్థిరపడ్డారు. వారు దీనికి జింజిరా అనే పేరు పెట్టారు. 1900లో ఈ ద్వీపాన్ని బ్రిటిష్వారు తమ భారత రాజ్యంలో భాగం చేసుకున్నారు. క్రిస్టియన్ గురువు సెయింట్ మార్టిన్స్ పేరును పెట్టారంటారు. మరోవైపు నాటి చిట్టగాంగ్ డిప్యూటీ కమిషనరు గౌరవార్థం మార్టిన్ పేరు పెట్టినట్లు ప్రచారం జరిగింది. 1947లో భారత్ విభజన తర్వాత ఇది తూర్పు పాకిస్థాన్లో భాగమైంది. ఆ తర్వాత బంగ్లాదేశ్కు దక్కింది. 1974లో దీనిపై బంగ్లా సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ మయన్మార్ ఒప్పందం చేసుకుంది. ఇక్కడ సముద్ర సరిహద్దుల గుర్తింపు పూర్తి కాలేదు. దీంతో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
కోకోనట్ ఐలాండ్ చిక్కితే ఆసియాపై పట్టు..
బంగాళాఖాతంలో పలు దేశాల మధ్యలో ఈ ద్వీపం ఉండటంతో అమెరికా దృష్టి దీనిపై ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ సైనిక స్థావరం నిర్మిస్తే.. ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన మలక్కా జలసంధిపై నేరుగా దానికి పట్టు లభిస్తుంది. ఈ ద్వీపంపై ఆసక్తి లేదని అమెరికా అధికారికంగా పలుమార్లు చెప్పినా.. ఇక్కడ స్థావరం ఏర్పాటుకు చాలా యత్నాలు చేసింది. దీనికి సమీపంలో కాక్స్ బజార్ పోర్టును చైనా నిర్మిస్తోంది. దీనికి సమీపంలోని ఈ ద్వీపంలో స్థావరం ఉంటే నిఘాకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందని అగ్రరాజ్యం భావిస్తోంది.
అరకాన్ ఆర్మీ కన్ను..
మయన్మార్లో సైన్యం.. రోహింగ్యాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటంతో లక్షల మంది బంగ్లాదేశ్కు వలస వచ్చారు. వీరంతా కాక్స్బజార్ సమీపంలోని కుటుపలాంగ్ శరణార్థి శిబిరంలో తలదాచుకున్నారు. వీరికి మద్దతుగా ఉండే అరకాన్ ఆర్మీ ఇటీవల కాలంలో సెయింట్ మార్టిన్స్ ద్వీపంపై హక్కును ప్రకటించుకుంది. కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వం దానిని తోసిపుచ్చింది. మరోవైపు అరకాన్ ఆర్మీ కారణంగా ఈ ద్వీపంపై తరచూ మయన్మార్ దళాలు కాల్పులు జరుపుతుంటాయి. దీంతో బంగ్లాదేశ్ తమ నౌకాదళాన్ని ఇక్కడ మోహరించాల్సి వచ్చింది.






