దాడులతో వణుకుతున్న పాకిస్తాన్..
పాకిస్తాన్ .. పేరుకు ఓ దేశం.. అణ్వాయుధ పరిజ్ఞానమున్న కంట్రీ. కానీ.. ఆదేశ సైనిక సామర్థ్యం మాత్రం నానాటికి తీసికట్టుగా మారుతోంది. ఓవైపు ఆఫ్గన్ ప్రేరేపిత పాకిస్తాన్ లోని తాలిబన్లు.. ఇష్టానురీతిలో పాక్ సైన్యం, పోలీసులపై దాడులు చేస్తున్నారు. భారీ నష్టాలే మిగులుస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై దాడిచేసిన చరిత్ర కూడా తెహ్రీక్ ఏ తాలిబన్ కు ఉంది. దీంతో పాకిస్తాన్, తాలిబన్ల మధ్య రోజురోజుకూ వైరం పెరుగుతోంది.
మరోవైపు బలూచిస్తాన్ వేర్పాటు వాదం.. పాకిస్తాన్ ను అతలాకుతలం చేస్తోంది. తాము స్వతంత్రులుగా ఉండాలన్న ఆకాంక్ష వారిలో పెల్లుబుకుతోంది. దీంతో పాకిస్తాన్ లోని పలుప్రాంతాలపై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేస్తోంది. పాకిస్థాన్లోని రెండో అతిపెద్ద నేవీ ఎయిర్స్టేషన్ పీఎన్ఎస్ సిద్ధిఖ్పై సోమవారం రాత్రి దాడి జరిగింది. బలూచిస్థాన్లో ఉన్న ఈ స్థావరంపై పలువురు తిరుగుబాటుదారులు తుపాకులు, బాంబులతో విరుచుకుపడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. నలుగురు తీవ్రవాదులను హతమార్చారు. వారు లోపలికి ప్రవేశిస్తుండగానే గుర్తించి మట్టుబెట్టామని అక్కడి అధికారులు తెలిపారు. ఎయిర్స్టేషన్కు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించారు. ఈ స్థావరంలో చైనాకు చెందిన డ్రోన్లను పెద్ద ఎత్తున మోహరించినట్లు సమాచారం.
ఈ దాడికి బాధ్యత వహిస్తూ ‘బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ కాల్పుల్లో పాకిస్థానీ బలగాలకు చెందిన డజను మంది మృతిచెందినట్లు తెలిపింది. పాకిస్థాన్ సైన్యం మాత్రం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. వారం రోజుల్లో ఈ ముఠా ఇలాంటి దాడికి యత్నించడం ఇది రెండోసారి. మార్చి 20న గ్వాదర్ పోర్టుపైనా తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భద్రతా బలగాలు ఏడుగురిని హతమార్చాయి. బీఎల్ఏను పాకిస్థాన్ తో పాటు అమెరికా, యూకే ఉగ్రసంస్థగా గుర్తించాయి. పాకిస్థాన్లోని అతిపెద్ద ప్రావిన్స్గా పిలిచే బలూచిస్థాన్ అనేక కొండలతో కూడిన ప్రాంతం.
స్వాతంత్య్రం కోసం ఇక్కడ అనేక గ్రూపులు కొన్నేళ్లుగా తిరుగుబాటు చేస్తున్నాయి. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులను ఈ గ్రూపులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా బీఎల్ఏ వేర్పాటువాద సంస్థ చైనా పెట్టుబడులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బలూచిస్థాన్లోని గ్యాస్, ఖనిజ వనరులను చైనా, పాక్ దోపిడీ చేస్తున్నాయని ఆరోపిస్తోంది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్)లో భాగంగా ఇక్కడి గ్వాదర్ పోర్ట్, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధిలో చైనా పాలుపంచుకుంటోంది.






