మాకు జీవించే హక్కు ఉంది… బంగ్లాదేశ్ లో హిందువుల ఆందోళన
బంగ్లాదేశ్ చరిత్రలోనే ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. తమపై జరుగుతున్న అరాచకాలకు ఎదురుతిరిగింది హిందూ సమాజం. తాము బంగ్లాజాతీయులమని.. తమపై అన్యాయాలు, అక్రమాలు జరగడం దారుణమంటూ.. రోడ్డుపై వేలాది మంది హిందువులు ఆందోళనకు దిగారు. రోడ్డును దిగ్భందించారు. దీంతో ఈ అంశం ఒక్కసారిగా ప్రపంచదేశాలను ఆకర్షించింది. ఈ ఆందోళనలు అక్కడి అవామీలీగ్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే, ఈ అకృత్యాలకు వ్యతిరేకంగా బంగ్లా వ్యాప్తంగా హిందువులు తిరగబడుతున్నారు. పలు ప్రాంతాల్లో కర్రలు, ఆయుధాలు చేతబూని మతోన్మాద శక్తులకు ఎదురుతిరుగుతున్నారు. కొన్ని గ్రామాల్లో గ్రామరక్షక కమిటీలు కూడా ఏర్పడి మూకదాడులకు వ్యతిరేకంగా ఎదురునిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో తమను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడటంపై హిందువులంతా రాజధాని ఢాకాలో వీధుల్లోకి వచ్చారు. దేవాలయాలు ధ్వంసం చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. ‘‘మైనారిటీలను రక్షించండి’’ అంటూ నినాదాలు చేస్తున్న వీడియోలో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ‘‘మనం ఎవరు..? బెంగాలీ బెంగాలీ’’ అంటూ నినదిస్తున్నారు. ‘హరే కృష్ణ, హరే కృష్ణ’ నినాదాల మధ్య శుక్రవారం రాజధానిలోని ఒక కూడలిని దిగ్భందనం చేసిన నిరసనకారులు .. తమకు శాంతి, రక్షణ కావాలంటూ నినదించారు.
బంగ్లాదేశ్లో 17 కోట్ల జనాభా ఉంటే ఇందులో 8 శాతం హిందువులు ఉన్నారు. ఆగస్టు 5న అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత 230 మందికి పైగా మరణించారు. హింసాకాండలో ఒక పాఠశాల ఉపాధ్యాయుడు మరియు ఇద్దరు హిందూ కౌన్సిలర్లు మరణించారు .కనీసం 45 మంది గాయపడినట్లు రాయిటర్స్ నివేదించింది. బంగ్లాదేశ్లోని ఖుల్నా డివిజన్లో ఉన్న మెహెర్పూర్లోని ఇస్కాన్ దేవాలయాన్ని కూడా ధ్వంసం చేసి తగులబెట్టారు. దేశంలోని 64 జిల్లాల్లో కనీసం 52 జిల్లాలు మత హింసకు గురయ్యాయని బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యత మండలి పేర్కొంది. మైనారిటీల రక్షణ మరియు శ్రేయస్సును కాపాడాలంటూ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్కు కౌన్సిల్ విజ్ఞప్తి చేసింది.
రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకం మొదలైన అల్లర్లు దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలకు కారణమయ్యాయి. ఈ ఘటనల్లో 500 మందికి పైగా ప్రజలు మరణించారు. చివరకు షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియాకు పారిపోయి రావాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ విజేత మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది. షేక్ హసీనా గద్దె దిగినా కూడా ఆ దేశంలో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మైనారిటీలైన హిందువులపై దాడులు, అకృత్యాలు చోటు చేసుకున్నాయి. హిందూ ఆలయాలకు నిప్పు పెట్టడంతో పాటు హిందువుల వ్యాపారాలను దోచుకుంటున్నారు. ముఖ్యంగా మహిళల్ని కిడ్నాప్ చేసి అత్యాచారాలకు తెగబడుతున్నారు.






