ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

వైభవంగా జరిగిన ‘తానా కళారాధన’

వైభవంగా జరిగిన ‘తానా కళారాధన’

హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, అలనాటీ సినీ ప్రముఖులకు సత్కారం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో డిసెంబర్‌ 16వ తేదీన నిర్వహించిన ‘తానా కళారాధన’ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, నాటి సినీ నటీనటులు కృష్ణవేణి, నటులు కోట శ్రీనివాసరావు, మురళీమోహన్‌, గిరిబాబు, గాయని సుశీల, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శకుడు కోదండరామిరెడ్డితోపాటు గాయని సునీత, మాజీ ఎంపి యార్లగడ్ల లక్ష్మీప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, ఖండాంతరాలు దాటి వెళ్ళినా జన్మభూమి ఋణం తీర్చుకొంటున్న తానా సంస్థ సేవలను అభినందించారు. మాతృ మూర్తిని, మాతృ భాషను, ఉన్న వూరిని, గురువులను ఎన్నటికీ మరువరాదని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోకన్నా అమెరికాలో తెలుగు వెలుగుతోందని, మాతృభాష అభివృద్ధి కోసం ప్రవాసులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారని, ఇక్కడున్న తెలుగువారు వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వెంకయ్యనాయుడు తెలిపారు.  ముందు మన భాషను నేర్చుకోవాలి, ఆ తరువాతే ఆంగ్లం నేర్చుకోవాలి అని చెబుతూ, పిల్లలు మాతృభాషలో మాట్లాడేలా చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలని కోరారు. ఇతర భాషలు నేర్చుకోవడంలో తప్పులేదు.. కానీ అమ్మభాషను మరిచిపోరాదని, మాతృభాషలో చదవడం వల్ల ఉన్నతపదవులు రావన్న భావన వద్దని అంటూ, ప్రస్తుత రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మాతృభాషలోనే చదువుకుని ఉన్నత పదవులను చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఉదహరించారు. తానూ కూడా పల్లెటూరులో మాతృభాషలో చదువుకున్న విషయాన్ని గుర్తు చేశారు.  

ఈ కార్యక్రమంలో అలనాటి సినీ నటి కృష్ణవేణి, నటులు కోట శ్రీనివాసరావు, మురళీమోహన్‌, గిరిబాబు, గాయని సుశీల, రచయిత పరుచూరి గోపాలకృష్ణ,  దర్శకుడు కోదండరామిరెడ్డి, గాయని శోభారాజు, సంగీత గురువు రామాచారి, సినీనటుడు బ్రహ్మానందం, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తదితరులను సన్మానించారు. అంతకుముందు ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. గురు రామాచారి ఆధ్వర్యంలో వారి శిష్యులు దాదాపు 80 మంది చేసిన గణేశ వందనంతో కార్యక్రమాలను ప్రారంభించారు. సౌందర్య కౌశిక్‌ చేసిన నాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. రమాదేవి శిష్యులు చేసిన నృత్య ప్రదర్శన కూడా ఆకట్టుకుంది. దాదాపు 85 మందికిపైగా కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతి అట్లూరి గారు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడంలో సహకరించి విజయవంతం చేశారు. 

ఈ కార్యక్రమంలో అమెరికాలో 20 సంవత్సరాలకు పైగా తెలుగు ఎన్నారైలకు మీడియాపరంగా సేవలందిస్తున్న ‘తెలుగు టైమ్స్‌’ యూ ట్యూబ్‌ ఛానల్‌ను కూడా ప్రారంభించారు. ప్రముఖ గాయని సుశీల చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. 

ఈ కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్లను కూడా ఘనంగా సత్కరించారు. స్కందన్‌షి గ్రూపుకు చెందిన సురేష్‌ రెడ్డి దంపతులను కూడా తానా నాయకులు శాలువా, మెమెంటోలతో సన్మానించారు. 

ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్‌ కమిటీ కన్వీనర్‌ రవి పొట్లూరి, తానా చైతన్యస్రవంతి కో ఆర్డినేటర్‌ సునీల్‌ పంత్ర, ఫౌండేషన్‌ కార్యదర్శి శశికాంత్‌ వల్లేపల్లి తదితర తానా నేతలు పాల్గొన్నారు.

 

Click here for Event Gallery

 

 

 

 

Tags :