ASBL NSL Infratech

సీమాంధ్ర సంఘీభావ సభలో మంత్రి కేటీఆర్

సీమాంధ్ర సంఘీభావ సభలో మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నిర్వహించిన సీమాంధ్ర సంఘీభావ సభలో ''హమారా హైదరాబాద్‌'' కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో హైదరాబాద్‌లో ఎక్కడైనా పొరపాట్లు జరిగాయా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయాంలో హైదరాబాద్‌ మహానగరంలో కనీసం 4 సెకెండ్లు కూడా కర్ఫ్యూ విధించలేదని గుర్తు చేశారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే 24 గంటల విద్యుత్‌ అమలవుతోందన్నారు. కులం, మత, ప్రాంతం పేరిట టీఆర్‌ఎస్‌ రాజకీయం చేయలేదన్నారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా లేకే నాలుగు పార్టీలు జట్టుకట్టి వస్తున్నాయని విమర్శించారు. 9 ఏళ్లలో హైదరాబాద్‌ అభివృద్ధి చేశానంటున్న చంద్రబాబు నాలుగేళ్లలో అమరావతిని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు.

ఒక రాజకీయ నాయకుడిపై దాడి జరిగితే అందరూ స్పందిస్తారని, జగన్‌పై దాడి ఘటనపై స్పందించిన వారిని చంద్రబాబు తప్పు పట్టడం సరికాదని హితవు పలికారు. జగన్‌పై దాడి విషయంలో లోకేశ్‌ సైతం స్పందించారని, అలాచూస్తే జగన్‌, మోదీ, టీఆర్‌ఎస్‌తో నారా లోకేశ్‌ కూడా కలిసిపోయినట్టేనా అని ప్రశ్నించారు. హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతిచెందితే ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించామని, ఆయన అంత్యక్రియల్ని తమ ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించామన్నారు. దాన్ని కూడా తప్పుపడతారా? అని ప్రశ్నించారు.

 

Tags :