Prashant Kishore: బిహార్ కింగ్ మేకర్ ఎవరవుతారో…?

బిహార్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఓ వైపు ఎన్డీఏ కూటమి అపరచాణక్యుడు నితీష్(Nitish) నేతృత్వంలో దూసుకెళ్తోంది. నితీష్.. ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. చేతికి ఎముక లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు .. తేజస్వీ(Tejaswi) యాదవ్ నేతృత్వంలో ఇండీ కూటమి బలంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లోనూ తేజస్వీ .. ఎన్డీఏ కూటమికి గట్టి పోటీ ఇచ్చారు. దీంతో ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలన్న కసి తేజస్వీ నేతృత్వంలోని ఆర్జేడీలో కనిపిస్తోంది. ఆర్జేడీ కార్యకర్తలు సైతం అదే పంతంతో పనిచేస్తున్నారు.
అయితే ఈసారి ఎన్నికల సరళి చూస్తే.. ఇరు పక్షాలు హోరాహోరీగా తలపడనున్నట్లుతెలుస్తోంది.ఈ సమయంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) ఇప్పుడు బిహార్ రాజకీయాల్లో కీలక శక్తిగా మారబోతున్నట్లు తాజా ఒపీనియన్ పోల్ ఒకటి స్పష్టం చేసింది. ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన కూటముల మధ్య గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో పీకే మద్దతు ఎవరికి దక్కితే వారే అధికార పీఠాన్ని చేజిక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.సర్వే ఫలితాల ప్రకారం, ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీకి 8.3 శాతం ఓట్లు లభించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరికి మీ మద్దతు అని ప్రశ్నించగా, సర్వేలో పాల్గొన్న వారిలో 13.70 శాతం మంది పీకే వైపు మొగ్గు చూపడం గమనార్హం.
ఇక, సీఎం రేసులో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ 33.5 శాతం మద్దతుతో అందరికంటే ముందున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు 24 శాతం మంది మద్దతు పలికారు. కూటముల విషయానికొస్తే, అధికార ఎన్డీయేకు 36.2 శాతం మంది మద్దతు తెలుపగా, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాకూటమికి 35.8 శాతం మంది ఓటు వేస్తామని చెప్పారు. ఈ రెండు కూటముల మధ్య కేవలం స్వల్ప ఓట్ల తేడా మాత్రమే ఉండటంతో పోరు రసవత్తరంగా మారనుంది.
ఈ ఎన్నికల్లో నిరుద్యోగం, ఓటర్ల జాబితా సవరణ వంటి అంశాలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని సర్వేలో పాల్గొన్న ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఈ సమస్యలే ఎన్నికల ఫలితాలను నిర్దేశించే కీలక అంశాలుగా మారనున్నాయని తెలుస్తోంది.