Rahul Gandhi: నిన్న ఆటంబాంబ్.. త్వరలో హైడ్రోజన్ బాంబ్.. మోడీ టీమ్ టార్గెట్ గా రాహుల్ పంచెస్..!

ఓట్ చోరీ అంశాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్.. తన సర్వశక్తియుక్తుల్ని ప్రయోగించి మరీ మోడీ (Modi) సర్కార్ పై దాడి చేసింది. గత ఎన్నికల్లో మోడీ, అతని టీమ్ కు ఈసీ కూడా సహకరించిందని సాక్షాత్తూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ (Rahul Gandhi) ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు.. ఏయే నియోజకవర్గంలో ఎన్నెన్ని ఓట్లు చోరీ అయ్యాయో వివరాలతో ప్రజల్లోకి వెళ్లారు. ఫలితంగా బీజేపీ సైతం ఎదురుదాడికి దిగింది. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదంది. మరోవైపు.. ఈసీ కూడా రాహుల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే ఈ విషయంలో రాహుల్ , కాంగ్రెస్ నేతలు అస్సలు తగ్గడం లేదు. ఓట్ల చోరీ విషయంలో ఇటీవల అణుబాంబు పేల్చామని, త్వరలో మరింత శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబు పేలుస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారని వ్యాఖ్యానించారు.
‘ఓటర్ అధికార్ యాత్ర’ ముగింపు సందర్భంగా పాట్నాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని దెబ్బతీస్తామంటే బీజేపీని అనుమతించేది లేదని అన్నారు. అందుకే ఈ యాత్రను నిర్వహించామని, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని అన్నారు.మహారాష్ట్ర, కర్ణాటకలలో ఓట్ల చోరీ జరిగిందని ఆధారాలతో సహా నిరూపించామని వెల్లడించారు. ఓట్ల చోరీ అంటే హక్కుల చోరీ, ప్రజాస్వామ్య చోరీ, ఉపాధి చోరీ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో త్వరలో హైడ్రోజన్ బాంబును పేలుస్తామన్నారు రాహుల్..