Delhi: భారత్ కు దగ్గరవుతున్న తాలిబన్ సర్కార్…

మిత్రుడి విలువ మనకు కష్టమొచ్చిన సమయంలో తెలుస్తుందంటారు. అది నిజమే… కష్టకాలంలోనే మిత్రుడికి మరో మిత్రుడు అండగా ఉంటాడు. భారత్ -పాక్ పోరు సందర్బంగా పొరుగున ఉన్నఆఫ్ఘనిస్తాన్.. నిజమైన మిత్రుడిలా వ్యవహరించింది. తమపైనే కాదు పొరుగున ఉన్న ఆఫ్గనిస్తాన్ పైనా భారత్ దాడి చేసిందంటూ పాక్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తాలిబన్ సర్కార్ తిప్పికొట్టింది. ఈపరిణామంతో తాలిబన్లు.. భారత్ కు చేరువవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అఫ్గానిస్థాన్లోని తాలిబన్ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న ఆమిర్ఖాన్ ముత్తాఖీతో.. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ (S Jaishankar) ఫోన్లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించడాన్ని జైశంకర్ స్వాగతించారు. ఈవిషయాన్ని కేంద్రమంత్రి ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. తాలిబన్ (Taliban) ప్రభుత్వంతో న్యూఢిల్లీ మంత్రిత్వ స్థాయి చర్చలు జరపడం ఇదే తొలిసారి .
‘‘అఫ్గాన్ (Afghanistan) తాత్కాలిక విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్తో మంచి సంభాషణ జరిగింది. పహల్గాం ఉగ్రదాడిని ఆయన ఖండించడం హర్షణీయం. భారత్-అఫ్గానిస్థాన్ మధ్య విభేదాలు సృష్టించేందుకు ఇటీవల అవాస్తవ, నిరాధార ప్రచారం జరిగింది. దాన్ని ఆయన తోసిపుచ్చడాన్ని స్వాగతిస్తున్నా. అఫ్గాన్ ప్రజలతో మా స్నేహబంధాన్ని కొనసాగిస్తాం. వారి అభివృద్ధికి నిరంతర మద్దతు అందిస్తాం. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశంపై మేం చర్చలు జరిపాం’’ అని జైశంకర్ తన పోస్ట్లో రాసుకొచ్చారు.
2021 ఆగస్టులో అఫ్గాన్లో తాలిబన్ పాలన ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ ప్రభుత్వాన్ని భారత్ అధికారికంగా గుర్తించనప్పటికీ దౌత్య సంబంధాలు మాత్రం కొనసాగిస్తోంది. ఈ ఏడాది జనవరిలో దుబాయ్ వేదికగా ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. మరోవైపు, అఫ్గాన్లో అల్ఖైదా, ఐసిస్, తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ వంటి ఉగ్రముఠాల ఉనికిపై న్యూఢిల్లీ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తాలిబన్ మంత్రితో జైశంకర్ చర్చలు జరపడం తాజా పరిస్థితుల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.