Mithra Mandali: ‘మిత్ర మండలి’ సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు – నిర్మాతలు కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప

ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా విజయేందర్ దర్శకత్వంలో బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’ (Mithra Mandali). ఈ మూవీ అక్టోబర్ 16న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో నిర్మాతలు కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప మీడియాతో ముచ్చటించారు. వారు చెప్పిన విషయాలు, విశేషాలు.
‘మిత్ర మండలి’ కథ మీ వద్దకు ఎలా వచ్చింది? ఈ జర్నీ ఎలా ప్రారంభమైంది?
బన్నీ వాస్ మాకు మంచి స్నేహితులు. గీతా ఆర్ట్స్లో మేం చాలా కాలం ఆయనతో పాటుగా పని చేశాం. ‘కోటబొమ్మాళీ పీఎస్’, ‘ఆయ్’, ‘తండేల్’, ‘సింగిల్’ ఇలా చాలా చిత్రాల్ని చేశాం. వాసు గారు ఈ కథతో చాలా ఏళ్లుగా ట్రావెల్ అవుతున్నారు. ఓ సారి మా ఇద్దరినీ ఈ కథ వినమని చెప్పారు. కళ్యాణ్ ఎక్కువగా వ్యాపారాల్లో బిజీగా ఉంటారు. మేం ఇద్దరం ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకున్నాం. ఆ టైంలో ఈ కథను విన్నాం. ఈ మూవీతో పాటుగా మరో రెండు ప్రాజెక్టుల్ని కూడా స్టార్ట్ చేశాం. వాసు గారి వల్లే ఈ కథ మాకు వచ్చింది. ఈ స్టోరీ నాకు చాలా నచ్చింది. ఆద్యంతం వినోదాన్ని అందిస్తూనే సెటైరికల్గా ఉంటుంది.
దర్శకుడు విజయేందర్ గురించి చెప్పండి?
విజయేందర్ మంచి దర్శకుడు. అనుదీప్, ‘మ్యాడ్’ కళ్యాణ్, ఆదిత్య హాసన్లతో విజయేందర్ పని చేశాడు. పూర్తి స్క్రిప్ట్తోనే మా వద్దకు వచ్చాడు. కథను ఎంత అద్భుతంగా రాసుకున్నాడో.. అంతే అద్భుతంగా తీశాడు. కొత్త దర్శకుడిలా, మొదటి సినిమాలా అనిపించలేదు.
కథలో మీ పాత్ర ఎంత ఉంది?
మేం రైటర్స్తో కలిసి రైటింగ్ రూంని ముందుగా ప్రారంభించాం. అక్కడ పుట్టిన కథలతోనే ‘ఆయ్’, ‘తండేల్’ బయటకు వచ్చాయి. అందుకే మేం ఆ చిత్రాలకు కో ప్రొడ్యూసర్స్గా వ్యవహరించాం. స్క్రిప్ట్ ఓ లెవెల్ వచ్చే వరకు మేం అందులో ఇన్వాల్వ్ అవుతాం.
‘మిత్ర మండలి’లోని క్యాస్టింగ్ గురించి చెప్పండి?
డైరెక్టర్కి కథ రాసుకున్నప్పుడే క్యాస్టింగ్ మీద చాలా ప్లానింగ్ ఉంది. ఏ ఏ పాత్రకు ఎవరు కావాలని ముందు నుంచీ ఫిక్స్ అయి ఉన్నాడు. ప్రతీ పాత్రకు ఆయన తీసుకున్న ఆర్టిస్ట్లు పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు.
నిర్మాతలుగా మొదటి ప్రాజెక్ట్ కదా.. ఈ ప్రయాణం ఎలా ఉంది?
చిత్ర కథ, కథనాల గురించి మేం అంతా కలిసి మాట్లాడుకునే వాళ్లం. చర్చించుకునే వాళ్లం. సలహాలు, సూచనల్ని అందరం పంచుకునేవాళ్లం. చర్చల్లో అభిప్రాయ భేదాలు సహజం. కానీ వాటికన్నా సినిమా గొప్పది.
బ్రహ్మానందం గారి పాత్ర ఎలా ఉండబోతోంది?
‘మిత్ర మండలి’లో బ్రహ్మానందం గారి పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ‘జంబర్ గింబర్ లాలా’ పాటను అనుకోకుండా చిత్రీకరించాం. ముందు అసలు ఆ పాటను అనుకోలేదు. కానీ మాకు సినిమా పూర్తయిన తరువాత ఏదో అసంతృప్తిగా అనిపించింది. దీంతో బ్రహ్మానందం గారితో అలా పాటను చిత్రీకరించాం. ఆయన కూడా ఆ పాటను, లిరిక్స్ను ఎంజాయ్ చేశారు.
‘మిత్ర మండలి’ని ‘జాతి రత్నాలు’తో పోల్చుతున్నారు కదా?
‘మిత్ర మండలి’ అనేది కూడా బడ్డీస్ కామెడీ. అందుకే అందరూ ‘జాతి రత్నాలు’ సినిమాతో పోల్చుతున్నారు. మా మూవీని చూసిన ప్రతీ ఒక్కరూ మాత్రం ఎంజాయ్ చేస్తారు. ‘జాతి రత్నాలు’ కథకు, మా సినిమా కథకు ఎలాంటి సంబంధం లేదు. ఆ మూవీని ఎంతలా ఎంజాయ్ చేశారో మా చిత్రాన్ని చూసి కూడా అంతే ఎంజాయ్ చేస్తారు.
ప్రియదర్శి, నిహారిక పాత్రలు ఎలా ఉండబోతోన్నాయి?
‘జంగ్లీ పట్టణం’ అనే ఓ ఫిక్షనల్ టౌన్ను డైరెక్టర్ క్రియేట్ చేశాడు. ఆ ఫిక్షనల్ టౌన్లో జరిగే కథ, అందులోని పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ చిత్రం ఎక్కువగా యూత్కు రిలేట్ అవుతుంది.. వారికి ఇంకా ఎక్కువగా నచ్చుతుంది. నిహారిక మాట్లాడితే ఓ సెటైర్ కనిపిస్తుంది. ఇందులో అలాంటి పాత్రే ఉంటుంది. అందుకే ఆమెను తీసుకున్నాం. అల్లు అరవింద్ గారు నిహారికను చూసిన వెంటనే ఓకే చేశారు.
‘మిత్ర మండలి’ చిత్రీకరణలో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి?
‘మిత్ర మండలి’లో భారీ తారాగణం ఉంది. పెద్ద పెద్ద ఆర్టిస్టులున్నారు. వారి డేట్లు సర్దుబాటు చేసుకుని షూటింగ్ చేసే సరికి కాస్త ఆలస్యం అయింది. ఆర్టిస్టుల డేట్లను అడ్జస్ట్ చేసుకోవడమే సవాల్గా అనిపించింది.
‘మిత్ర మండలి’లో కుల వ్యవస్థ మీద సెటైర్స్ వేసినట్టుగా ఉన్నారు?
‘మిత్ర మండలి’ కోసం లేని ఓ కులం పేరుని తీసుకు వచ్చాం. అలా చేసిన ఫిక్షనల్ క్యాస్ట్తో సమాజంలో ఉన్న క్యాస్ట్ సిస్టం మీద సెటైరికల్గా సీన్లను చిత్రీకరించాం.
దీపావళికి పోటీ చాలానే ఉంది కదా?
దీపావళి పండుగ వాతావరణంలో ఎన్ని మంచి చిత్రాలు వచ్చినా జనాలు చూస్తారు. మంచి సినిమాను ఆడియెన్స్ కచ్చితంగా చూస్తారు. ఆ నమ్మకంతోనే మా మూవీని దీపావళి సీజన్లోకి తీసుకు వస్తున్నాం.
మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ల గురించి చెప్పండి?
మేం అన్ని రకాల జానర్లలో చిత్రాల్ని చేయాలని ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు కామెడీ ఎంటర్టైనర్తో వస్తున్నాం. త్వరలోనే హారర్ మూవీని ప్రారంభించనున్నాం. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా మంచి కథలతో సినిమాల్ని తీయాలని అనుకుంటున్నాం.