విశాల్ 'రత్నం' ట్రైలర్ టాక్
విశాల్ కు తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ మాస్ ఇమేజ్ ఉంది. పందెం కోడి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విశాల్ ఆ తర్వాత కొన్ని వరుస సినిమాలు చేసి తన ఇమేజ్ ను పెంచుకున్నాడు. ఆ తర్వాత స్టోరీ సెలక్షన్స్ లో చేసిన తప్పుల వల్ల డిజాస్టర్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు విశాల్, మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో రత్నం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఏప్రిల్ 26న రిలీజ్ కానున్న రత్నం సినిమా ట్రైలర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే విశాల్ ఈసారి కథ విషయంలో రిస్క్ తీసుకోనట్లే కనిపిస్తున్నాడు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే గ్రామాలు, ఆ గ్రామ పెద్దల మధ్య ఉండే పగలు, అవతలి వర్గానికి చెందిన అమ్మాయిని లవ్ చేసి ఆమె కోసం ఎంత దూరమైనా వెళ్లే యువకుడిగా విశాల్ కనిపిస్తున్నాడు.
ట్రైలర్ మొత్తం చూశాక ఒక్కడు సినిమాకు తమిళ ఫ్లేవర్ యాడ్ చేసినట్లు అనిపిస్తుంది. దేవీ శ్రీ సంగీతం పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. విశాల్ క్యారెక్టర్ మాస్ టచ్ తో ఉన్నప్పటికీ గతంలో చూసినట్లే ఉంది. ఏదేమైనా రత్నం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నాడు డైరెక్టర్ హరి. రిలీజ్ కు ఇంకో పది రోజులు టైమ్ ఉండటంతో ఈలోగా సినిమాను ఇంకాస్త జనాల్లోకి తీసుకెళ్లడానికి ఛాన్సుంది. మరి ఈసారైనా విశాల్ మంచి ఫలితాన్ని అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.