ఓవైపు కార్చిచ్చు.. మరోవైపు హిమపాతంతో అమెరికా విలవిల..
అగ్రరాజ్యం అమెరికా ప్రకృతి ప్రకోపంలో కొట్టుమిట్టాడుతోంది. ఓవైపు టెక్సాస్ లో కార్చిచ్చు దావానలంలా మారింది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా లక్ష ఎకరాల్లో అటవీసంపదను భస్మీపటలం చేసింది. లక్షలాది విలువైన వృక్షాలు దహించుకుపోయాయి. ఇక అందులోని వన్యప్రాణుల సంగతి చెప్పనలవి కాదు.. ఈ ప్రమాదంలో ఊపిరిసలపక ఇద్దరు మృతి చెందగా.. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటల్ని అదుపు చేసేందుకు 3 వేల మందికి పైగా అధికారులను.. దావాగ్ని ప్రాంతంలో మోహరించారు. ఈ కార్చిచ్చును అదుపు చేసేందుకు అధికార యంత్రాంగం శాయసక్తులా ప్రయత్నిస్తున్నా.. వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదు.
ముఖ్యంగా ఈదురు గాలులతో మంటలు చెలరేగుతున్నాయి. ఓవైపు మంటల్ని ఆర్పేందుకు అధికారులు ప్రయత్నిస్తుంటే.. మరో ప్రాంతంలో మంటలు విజృంభిస్తున్నాయి.. దీనికి తోడు వాతావరణంలో వేడి పెరుగుతుండడంతో మంటల్ని ఆర్పడం కష్టసాధ్యంగా మారింది. ఇప్పటికే అటవీ ప్రాంతంతో పాటు సమీపంలోని పళ్లతోటలు సైతం అగ్నికి ఆహుతయ్యాయి. మరోవైపు...కాలిఫోర్నియాలో మంచు బీభత్సం సృష్టిస్తోంది. చలి గాలులు, మంచు తీవ్రతతో ఆ ప్రాంతమంతా పూర్తిగా గడ్డ కట్టుకుపోయే పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని పర్వత ప్రాంతాలు, ప్రధాన నగరాల రహదారులు మంచుతో నిండిపోవడంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. విద్యుత్తు సేవలకు అంతరాయం కలుగుతోంది.
దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సియెర్రా నెవాడా పర్వతాల్లో ఆదివారం 30 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా మంచు కురిసినట్లు అంచనా. మంచు తుపాను కారణంగా నెవాడాలోని ప్రధాన రహదారిని గతవారం మూసివేశారు. పర్వతప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. అధిక గాలులు, మంచు ప్రభావంతో కోల్ఫాక్స్, నెవాడా స్టేట్ లైన్ మధ్యనున్న అంతరాష్ట్ర సరిహద్దు, రహదారిని మూసివేశారు.
పర్వత ప్రాంతాల్లో గంటకు 72 కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తున్నట్లు జాతీయ వాతావరణ సర్వీసు వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో యోస్మైట్ నేషనల్ పార్క్ను మూసేశారు. కొన్ని ప్రాంతాల్లో మంచు తుపాను తగ్గుముఖం పట్టినప్పటికీ.. ...మళ్లీ సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ మంచు కారణంగా ఉత్తర కాలిఫోర్నియాలో వేల గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.