బోఇసి ఉగాది వేడుకలు
బోఇసీ నగరంలోని తెలుగువారు ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. బోఇసీ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 20న ఏర్పాటు చేసిన క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకల్లో పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ‘బోఇసీ తెలుగు అసోసియేషన్’ ఏర్పాటు ఉద్దేశాన్ని సంఘం వ్యవస్థాపకులు హరి విన్నమాల, అధ్యక్షుడు అనిల్ కుకుట్ల వివరించారు.
తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలు, గొప్పతనాన్ని గుర్తు చేసుకోవడంతో పాటు, మన పిల్లలతో పంచుకోవడమే బోఇసీ తెలుగు అసోసియేషన్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన 16 పెద్ద ఈవెంట్స్ విజయవంతం చేయడానికి ఎంతో కృషి చేసిన బీటీఏ ఉపాధ్యక్షురాలు సింధు మెట్పల్లి, కార్యదర్శి శివ నాగిరెడ్డి ఉయ్యూరు, కోశాధికారి రామ్ యాగంటి, మీడియా కార్యదర్శి భార్గవి రాజన్, సాంస్కృతిక నిర్వాహకులు మైత్రి కర్నటీ, ఈవెంట్ నిర్వాహకులు శశాంక్ వేమూరి, హరీష్ వీరవల్లికి ధన్యవాదాలు తెలిపారు.
‘క్రోధి’ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల విజయవంతానికి కృషి చేసిన వారికి హరి విన్నమాల, సింహాచలం మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ‘బోఇసీ తెలుగు అసోసియేషన్’ నూతన కార్యవర్గ పరిచయం కార్యక్రమం నిర్వహించారు. బీటీఏ నూతన అధ్యక్షురాలు సింధు మెట్పల్లి, ఉపాధ్యక్షులు శివ నాగిరెడ్డి ఉయ్యూరు, క్రియేటివ్ హెడ్ మైత్రి కర్నటీ, కార్యదర్శులు ధీరజ్ కనకనాల, ఆది మెడ్చెర్ల, కోశాధికారి ఫణి తేజ, సాంస్కృతిక నిర్వాహకులు అనంత్ నిభానుపూడిని సభికులకు పరిచయం చేశారు. వేడుకల్లో సుమారు 400 మంది తెలుగువారు పాల్గొన్నారు. పిల్లలు, పెద్దలు తెలుగు పాటలు, నృత్యాలతో సభికులను అలరించారు.