దీపావళి సంబరాలకు హాజరుకానున్న బైడెన్
అమెరికాలో ఈ సంవత్సరం జరిగే దీపావళి వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ పాల్గొంటున్నారు. తన అధికారిక నివాసం వైట్హౌస్లో జరిగే ఈ దీపావళి వేడుకల్లో ఆయన పాల్గొంటున్నట్లు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. దీపావళి పండుగకు బైడెన్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తారని పేర్కొన్నారు. భారత్-అమెరికా ద్వైపాక్షిక బంధాల బైడెన్ ఎంతో ప్రాముఖ్యత ఇస్తారని కూడా చెప్పారు. మరోవైపు.. మేరీల్యాండ్ గవర్నర్ లారెన్స్ హోగన్.. అక్టోబర్ నెలను హిందూ సాంస్కృతిక మాసంగా గుర్తిస్తున్నట్టు ప్రకటించారు. కాగా.. గతేడాది బైడెన్ దంపతులు దీపావళి పండుగను వైట్హౌస్లోనే జరుపుకున్నారు. ‘‘చీకటి నుంచి జ్ఞానంవైపు ప్రయాణించాలన్న విషయాన్ని ఈ వెలుగులు బోధిస్తున్నాయి అని ఆయన ట్వీట్ చేశారు. తన సతీమణితో కలిసి వైట్హౌస్లో దీపావళి జరుపుకుంటున్న ఫొటోను కూడా ఆయన ట్వీట్ చేశారు. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కాగా.. వైట్హౌస్లో దీపావళి జరుపుకోవాలన్న సాంప్రదాయం బుష్ హయాంలో మొదలైంది. నాటి నుంచి ప్రతిఏటా అమెరికా అధ్యక్షులు ఈ వెలుగుల పండుగను శ్వేతసౌధంలోనే జరుపుకుంటున్నారు.