మోదీ, రేవంత్ ఇద్దరూ ఒక్కటే.. కేసీఆర్ సంచలన ఆరోపణలు
ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒక్కటేనని, పైకి మాత్రమే నాటకాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్పై అవినీతి ఆరోపణలు చేసే ప్రధాని.. చర్యలు మాత్రం ఎందుకు తీసుకోరని, అలాగే తెలంగాణకు వ్యతిరేకంగా మోదీ వ్యాఖ్యలు చేస్తున్నా.. సీఎం ఎందుకు ఖండించరని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కొత్తగూడెంలో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డిపై మోదీ చేసిన ‘ఆర్ఆర్ ట్యాక్స్’ వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘రాష్ట్రంలో రేవంత్ ‘ఆర్ఆర్’ ట్యాక్స్ వసూల్ చేస్తున్నాడంటూ ప్రధాని మోదీ అంటున్నారు. మరి సీఎం రేవంత్ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుంటే.. ప్రధాని మోదీ ఎందుకు విచారణ జరిపించడం లేదు..? వాళ్లిద్దరూ ఒకటి కాకపోతే సీఎంపై ఈడీ, ఐటీని వెంటనే దించండి’’ అని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణకు గోదావరి నీళ్లు లేకుండా చేస్తామని మోదీ అన్నారని, కానీ ఆ వ్యాఖ్యలను సీఎం రేవంత్ ఎందుకు ఖండించడం లేదని కేసీఆర్ ప్రశ్నించారు.