నితిన్ భుజాల మీద భారీ భారం
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పరిస్థితి ఈ మధ్య అసలేం బాలేదు. అఆ తర్వాత నితిన్ నుంచి వచ్చిన ఒక్క భీష్మ సినిమా తప్ప అన్నీ డిజాస్టర్లే. గతేడాది ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నితిన్ ఘోర ఫలితాన్ని చవిచూశాడు. దానికి ముందు మాచర్ల నియోజకవర్గం సినిమాతో చేతులు కాల్చుకున్నాడు నితిన్. ఈ రెండు సినిమాలు తన సొంత బ్యానర్లో తీసినవే.
దీంతో ఇప్పుడు రిస్కులు మానేసి బయటి ప్రొడక్షన్ హౌసుల్లో సినిమాలు చేస్తున్నాడు నితిన్. అయితే తన గత సినిమాల రిజల్ట్స్ తో సంబంధం లేకుండా కొత్త సినిమాలకు నిర్మాతలు పెద్ద మొత్తంలోనే బడ్జెట్ ను పెడుతున్నారు. ప్రస్తుతం నితిన్ మైత్రీ బ్యానర్ లో రాబిన్ హుడ్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో తమ్ముడు సినిమాలు చేస్తున్నాడు.
భీష్మ కాంబో అయిన వెంకీ కుడుముల- నితిన్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో రాబిన్ హుడ్ మీద మైత్రీ నిర్మాతలు ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ సినిమాకు రూ.45-50 కోట్ల వరకు పెట్టడానికి రెడీ అయ్యారు. కానీ సినిమా మధ్యలోకి వచ్చేసరికి ఖర్చులు బాగా పెరగడంతో అనుకున్న బడ్జెట్ కంటే 40-50% ఎక్కువ ఖర్చయ్యేలా ఉందట. ఈ సినిమాకే కాదు తమ్ముడు సినిమాకు కూడా ఓ రేంజ్ లో బడ్జెట్ ను పెడుతున్నారట. జస్ట్ ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కే రూ.8 కోట్లు పెడుతున్నట్లు రీసెంట్ గా న్యూస్ కూడా వచ్చింది. తమ్ముడు సినిమా రూ.65-70కోట్లతో తెరకెక్కుతుందట. నితిన్ మార్కెట్ కు ఈ బడ్జెట్ చాలా అంటే చాలా ఎక్కువ. ఈ రెండు సినిమాలూ హిట్ అయితే తప్ప నితిన్ కు తర్వాత మంచి అవకాశాలు రావు.