టిక్ టాక్ నిషేధానికి అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం
చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ టిక్టాక్ నిషేధానికి సంబంధించిన బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. బిల్లుకు మద్దతుగా 352 మంది ఓటేశారు. 65 మంది మాత్రమే వ్యతిరేకించారు. అనంతరం ఇది సెనేట్కు చేరనుంది. విదేశీ నియంత్రిత యాప్ల నుంచి అమెరికన్లకు రక్షణ పేరిట తీసుకొచ్చిన దీన్ని భారత సంతతికి చెందిన డెమోక్రాటిక్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రతినిధి మైక్ గల్లాఘే కలిసి రూపొందించారు. ఈ బిల్లు టిక్టాక్ నిషేధానికి సంబంధించింది కాదు. దాన్ని నియంత్రిస్తున్న బైట్డ్యాన్స్ గురించి. టిక్టాక్ యాజమాన్యం పూర్తిగా దాని చేతిలో ఉంది. ఆ కంపెనీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధీనంలో పనిచేస్తోంది. బైట్డాన్స్ ఎడిటర్-ఇన్-చీఫ్ సీసీపీలో అత్యున్నత హోదాలో ఉన్నారు. అంటే పరోక్షంగా టిక్టాక్ను సీసీపీ నియంత్రిస్తోంది. టిక్టాక్ కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చు. కానీ, సీసీపీ నియంత్రణలో మాత్రం కాదు. అందుకే టిక్టాక్ నుంచి బైట్డ్యాన్స్ దాని మెజారిటీ వాటాలను ఉపసంహరించుకోవాలి. బిల్లులో ఈ అంశాలను మాత్రమే పొందుపర్చాం అని కృష్ణమూర్తి తెలిపారు.