యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో ... సత్తా చాటిన తెలుగు అమ్మాయి
యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ తుది ఫలితాల్లో మహబూబ్నగర్కు చెందిన అనన్య రెడ్డి సత్తా చాటారు. తొలి ప్రయత్నంలోనే తన అసాధారణ ప్రతిభతో మూడో ర్యాంకు సాధించారు. పదో తరగతి వరకు మహబూబ్నగర్ గీతం హైస్కూల్లో చదివిన అనన్య ఇంటర్ విద్యను హైదరాబాద్లో అభ్యసించారు. ఢిల్లీలోని మెరిండా హౌస్ కాలేజీలో డిగ్రీ చదివిన ఆమె ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోకుండానే ఈ ఘనతను సాధించారు. సివిల్స్ పరీక్ష ఎంతో కఠినంతో కూడినది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలలో ఎదురయ్యే కఠిన సవాళ్లను ఎదుర్కొని నిలవడం ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటి తొలి ప్రయత్నంలోనే కోచింగ్ కూడా తీసుకోకుండా దాదాపు సొంత ప్రిపరేషన్తోనే సివిల్స్లో జాతీయస్థాయిలో మూడో ర్యాంకుతో భళా అనిపించారు అనన్య రెడ్డి. ఇంటర్వ్యూ తర్వాత సివిల్స్కు ఎంపిక అవుతానని భావించినప్పటికీ, మూడో ర్యాంకు వస్తుందని మాత్రం అస్సలు అనుకోలేదని ఆమె తెలిపారు. సొంత ప్రణాళికతోనే రోజుకు 12 నుంచి 14 గంటల పాటు చదివినట్లు తెలిపారు. చిన్నప్పటినుంచే సమాజానికి సేవ చేయాలన్న కోరికతోనే సివిల్స్ను ఎంచుకున్నట్లు తెలిపారు.