ఏపీ రాజకీయాన్ని రాళ్ళ రాజకీయంగా మారుస్తున్న నేతలు..
ఎండాకాలం ఎండలు ఎక్కువైతే వడదెబ్బ తగులుతుంది అని మనం తెలుసు.. అయితే రాజకీయ నాయకులకు రాళ్ళ దెబ్బలు తగులుతున్నాయి. ఏపీలో ఈ రాళ్ళ రాజకీయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. శనివారం నాడు రాత్రి విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై రాళ్ళతో దాడి జరిగింది. ఆయన ఎడమ కంటికి తీవ్రంగా గాయం అవ్వడంతో ఈ విషయం పెద్ద ఎత్తున చర్చకు తావిచ్చింది. అయితే ప్రత్యర్ధులు ఇది కోడి కత్తి డ్రామా లాంటిది అంటూ ఆరోపించడం మొదలుపెట్టారు. దీనికి వైసిపి నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరో పక్క ఈసీ కూడా జగన్ పై జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. అయితే ఈ ఒక్క విషయం పొలిటికల్ హీట్ బాగా పెంచేసింది. ఇంతవరకు బాగానే ఉంది ఒకే రోజు వరుసగా టీడీపీ అధినేత చంద్రబాబుపై.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాళ్ళ దాడి జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తెనాలి సభలో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ పై ఓ ఆగంతకుడు రాయితో దాడి చేశాడు. ఇటు విశాఖపట్నం పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు వాహనంపై వెనుక నుంచి ఎవరో రాయి విసిరారు. మొత్తానికి ఒక్కరోజు తేడాతో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో కీలకమైన ముగ్గురు వ్యక్తులపై ఇలా రాళ్ల దాడి జరగడం సంచలనం రేకెత్తిస్తోంది. మొత్తానికి మూడు దాడులలో గాయపడిన వ్యక్తి మాత్రం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. అయితే ఇందులో ఎవరిపై జరిగిన దాడి వాస్తవం.. ఎవరిపై జరిగినది కల్పితం అన్న విషయం లో ప్రస్తుతానికి ఎవరికీ స్పష్టత లేదు.