తెలుగు టాలన్స్ ఘన విజయం 28-24తో రాజస్థాన్ పాట్రియాట్స్పై గెలుపు
ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్) తొలి సీజన్లో తెలుగు టాలన్స్ ముచ్చటగా మూడో విజయం నమోదు చేసింది. వరుసగా రెండు మ్యాచుల్లో ఎదురులేని విజయాలు సాధించిన తెలుగు టాలన్స్.. రెండు మ్యాచుల్లో ఓటమి అనంతరం మళ్లీ గెలుపు బాట పట్టింది. బుధవారం జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్ల రాజస్థాన్ పాట్రియాట్స్పై 28-24తో నాలుగు గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. రాజస్థాన్ పాట్రియాట్స్ 50 సార్లు గోల్కు చేరువగా రాగా.. టాలన్స్ గోల్ కీపర్ రాహుల్ అడ్డుగోడగా నిలిచాడు. దీంతో ఆ జట్టు 24 గోల్స్తోనే సరిపెట్టుకుంది. తెలుగు టాలన్స్ 48 సార్లు మాత్రమే గోల్ ప్రయత్నం చేసినా.. 28 గోల్స్తో అదరగొట్టింది. గ్రూప్ దశలో ఐదు మ్యాచుల్లో తెలుగు టాలన్స్కు ఇది మూడో విజయం.
తెలుగు టాలన్స్, రాజస్థాన్ పాట్రియాట్స్ ప్రథమార్థం అత్యంత ఉత్కంఠగా సాగింది. గోల్ కోసం ఇటు టాలన్స్, ఇటు పాట్రియాట్స్ చెమటోడ్చాయి. 14 నిమిషాల వద్ద 6-6తో టాలన్స్, పాట్రియాట్స్ సమవుజ్జీలుగా నిలువగా... ఆ తర్వాత రాజస్థాన్ నెమ్మదిగా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 9-7తో రెండు పాయింట్ల ముందంజ వేసిన రాజస్థాన్.. ప్రథమార్థం 30 నిమిషాల ఆటను పైచేయితో ముగించింది. తెలుగు టాలన్స్ పుంజుకున్నప్పటికీ 14-13తో విరామ సమయానికి రాజస్థాన్ ఓ గోల్ ఆధిక్యం సాధించింది.
ద్వితీయార్థం ఆరంభంతోనే తెలుగు టాలన్స్ లెక్క సరి చేసింది. తొలుత 14-14తో స్కోరు సమం చేసిన టాలన్స్ అదే ఊపులో 16-15తో ముందంజ వేసింది. రుఘు కుమార , అనిల్, దేవిందర్ సింగ్ భుల్లార్, నసీబ్ సింగ్ సహా కెప్టెన్ షియోరాన్ రాణించటంతో తెలుగు టాలన్స్ 24-19తో ఐదు గోల్స్ విలువైన ఆధిక్యంలో నిలిచింది. రాజస్థాన్ పాట్రియాట్స్ ఆఖరు ఐదు నిమిషాల్లో గోల్స్ కోసం గట్టిగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. 28-24తో నాలుగు గోల్స్ తేడాతో తెలుగు టాలన్స్ విజయం సాధించింది.