ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ
ఉత్తర్ప్రదేశ్లోని జౌన్పుర్ లోక్సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ శ్రీకళా రెడ్డి పోటీచేస్తున్నారు. ఆమె స్థానిక మాజీ ఎంపీ ధనుంజయ్సింగ్ మూడో భార్య. స్థానికంగా, రాజకీయంగా మంచిపట్టున్న ధనుంజయ్ సింగ్కు కిడ్నాప్, అక్రమ వసూళ్ల కేసులో శిక్షపడడంతో ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని కోల్పోయారు. దీంతో తాజా ఎన్నికల్లో ఆయన సతీమణి శ్రీకళారెడ్డికి బీఎస్పీ అధినేత్రి మాయావతి టికెట్ ఇచ్చారు. ఫలితంగా జౌన్పుర్లో బీజేపీ, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీల త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీ తరపున కృపాశంకర్సింగ్, ఎస్పీ తరపున బాబూసింగ్ కుశ్వాహా బరిలో ఉన్నారు.
శ్రీకళా రెడ్డి తండ్రి కె.జితేందర్ రెడ్డి. నల్గొండ జిల్లా కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా, హుజూర్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా పనిచేశారు. తల్లి లలితా రెడ్డి. గ్రామ సర్పంచిగా సేవలందించారు. నిప్పో బ్యాటరీ గ్రూప్ కంపెనీ ఈ కుటుంబానికి చెందినదే. ఇది చెన్నై కేంద్రంగా పనిచేయడంతో శ్రీకళారెడ్డి బాల్యం అక్కడే గడిచింది. ఆమె ఇంటర్మీడియట్ చెన్నైలో చేయగా, బీకామ్ కోర్సు హైదరాబాద్లో పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక అమెరికా వెళ్లి ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చేశారు. అనంతరం ఇండియాకు తిరిగొచ్చి కుటుంబ నడిపే వ్యాపారాలను చూసుకున్నారు.