జగన్ పై దాడి జరిగినప్పుడు కరెంట్ కోత వెనుక కారణం అదే..
విజయవాడలో మేము సిద్ధం బస్సు యాత్ర నేపథ్యంలో సీఎం జగన్ పై శనివారం నాడు రాయితో దాడి జరిగిన విషయం సంచలనంగా మారింది. దీనిపై స్పందించిన విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా.. మీడియాతో మాట్లాడుతూ జగన్ కు విజయవాడ పర్యటన సందర్భంగా తగినంత భద్రత కల్పించామని వెల్లడించారు. ఏపీఎస్పీ నుంచి నాలుగు ప్లాటూన్ ల బలగాలను సీఎం భద్రత కోసం ప్రత్యేకంగా కేటాయించామని ఆయన చెప్పారు. అయితే సీఎం రాలి సందర్భంగా కరెంటు పోవడం గురించి మీడియాలో ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయని.. రోడ్ షో నేపథ్యంలో సీఎం వాహనం రూఫ్ టాప్ పైకి ఎక్కిన సమయంలో వైర్లు తగలకుండా ఉండడం కోసం కొన్ని సందర్భాలలో కరెంట్ ఆఫ్ చేస్తారని ఆయన వివరించారు. భద్రతా కారణాలవల్ల అప్పుడప్పుడు ఇలా విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని.. అది సెక్యూరిటీ ప్రోటోకాల్ లో ఒక భాగం అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు సీఎం పై జరిగిన దాడి గురించి వెల్లంపల్లి గారు ఫిర్యాదు చేయడంతో ఐపీసీ 307 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.