తెలంగాణలో ఒక్క రైతు కూడా సంతోషంగా లేడు.. భారత్ జోడో గర్జనలో మండిపడ్డ రాహుల్ గాంధీ
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ కొన్నిరోజులుగా ‘భారత్ జోడో యాత్ర’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో ఆయన సోమవారం నాడు పర్యటించారు. ఈ క్రమంలో ఇక్కడ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామని, వారి పంటలకు గిట్టుబాటు ధర ఇస్తామని హామీ ఇచ్చారు. ‘భారత్ జోడో గర్జన’ పేరుతో ఇక్కడ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. తెలంగాణలో తను చాలా మంది రైతులతో మాట్లాడినట్లు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు అద్భుతంగా సేవ చేస్తున్నారని ఈ సందర్భంగా కొనియడారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘తెలంగాణలో ఏ ఒక్కరైతు సంతోషంగా లేడు. రాష్ట్రంలో విద్య, వైద్యం దయనీయ పరిస్థితిలో ఉన్నాయి. మీ భూములపై టీఆర్ఎస్ ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తోంది’ అంటూ మండిపడ్డారు. ప్రజల హక్కుల్ని రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ పరిస్థితిని కచ్చితంగా మారుస్తామని రాహుల్ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలో సోమవారం రాహుల్ పాదయాత్ర జరిగింది. ఇక్కడి మద్నూర్ మండలంలోని మేనూరు వద్ద భారీ బహిరంగ సభతో రాష్ట్రంలో రాహుల్ యాత్ర ముగుస్తుంది. ఆ తర్వాత మహారాష్ట్రలోని దెగ్లూర్లో రాహుల్ తన యాత్ర కొనసాగిస్తారు.