గోదారి తీరం గట్టెక్కించేనా..?
ఏపీ బీజేపీ చీఫ్ రాజమహేంద్రవరాన్ని ఎందుకు ఎంచుకున్నారు. విశాఖ, రాజంపేట కాదని రాజమహేంద్రవరంలో ఎందుకు పోటీ చేయాలని భావించారు. ఆ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే గెలవలేమన్న పరిస్థితి ఉందా..? లేక ఈ నియోజకవర్గంలో అనుకూలత కనిపిస్తోందా..? ఇక్కడ పోటీ చేస్తే, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు సహకరిస్తారా...? ఇంతకూ చిన్నమ్మ ధైర్యం వెనక ఉన్న కారణాలేంటి?
సోమువీర్రాజు వర్గం సహకరిస్తుందా....?
పురంధేశ్వరికి సొంత పార్టీలో అసమ్మతి తప్పడం లేదు. బీజేపీ పదాధికారుల సమావేశానికి మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరు కాలేదు. జ్వరంతో హాజరు కాలేదని ఆయన వర్గీయులు చెబుతున్నా.. సీటు దక్కలేదన్న అసంతృప్తితో సోము ఉన్నారన్న విషయం బహిరంగ రహస్యమే.దీంతో ఆయన వర్గీయులు ఎంతవరకూ పురంధేశ్వరికి సహకరిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనికి తోడు ఆ ప్రాంతంలో బీజేపీకి చెప్పుకోదగిన బలం కూడా లేదు. మిత్రపక్షాల ఓట్ల బదలాయింపు జరిగితే తప్ప గెలిచే పరిస్థితి కానరావడం లేదు.
టీడీపీ నేతలు మద్దతిస్తారా..?
మరోవైపు... టీడీపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బిజెపికి టిక్కెట్ కేటాయింపుపై టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు బొడ్డు వెంకటరమణ చౌదరి, గన్ని కృష్ణ వంటి నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఐదు స్థానాల్లో టిడిపి అభ్యర్థులు, రెండు స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ రెండు పార్టీల అభ్యర్థులను కలుపుకుని బిజెపి ఎలా ముందుకెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.
సామాజికవర్గమే బలం...
అయితే పురంధేశ్వరికి ఓ విషయంలో మాత్రం కాస్త సానుకూలత కనిపిస్తోంది.రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు భారీగా ఉన్నారు. ముఖ్యంగా రాజమండ్రి రూరల్ అసెంబ్లీలో మెజార్టీ ఓటర్లు వారే. అందుకే వ్యూహాత్మకంగా దగ్గుబాటి పురందేశ్వరి రాజమండ్రి పార్లమెంట్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు బీజేపీ గెలిచింది. 1998లో గిరిజాల వెంకటస్వామి నాయుడు, 1999 పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్బీపీబీకే సత్యనారాయణ రావు విజయం సాధించారు. దీనికితోడు తెలుగుదేశం పార్టీకి రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్,కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి నియోజకవర్గాల్లో మంచిపట్టుంది. కూటమి పార్టీలకు ఓటింగ్ శాతం ఎక్కువ ఉండటంతో పురందేశ్వరి రాజమండ్రి పార్లమెంట్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థి భరత్ రామ్ విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాసులును పురందేశ్వరి ఢీ కొట్టబోతున్నారు.