మంత్రులకు మోదీ కీలక సూచనలు...మంచి ప్లాన్ తో రండి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మార్చి 3న కేంద్ర మంత్రి మండలి సమావేశం కానుంది. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మంత్రులకు మోదీ కీలక సూచనలు చేసినట్లు సమాచారం. రాబోయే 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేయాలని వారిని కోరినట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఉండే వ్యవధికి సంబంధించిన అజెండాపై కసరత్తు చేయాలని మంత్రులు, మంత్రిత్వశాఖలకు ఆయన సూచించారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మోదీ కోరినట్లు తాజా సమాచారం. అమలు చేయగల, అంచనా వేయగల, స్పష్టమైన నిర్వచణతో కూడిన ప్రణాళికను త్వరలో జరగనున్న మంత్రిమండలి సమావేశంలో ప్రవేశపెట్టాల్సిందిగా కోరారు. అందుకోసం సీనియర్ బ్యూరోక్రాట్, డొమైన్ నిపుణులతో సహా కిందిస్థాయిలో పని చేసే వారితోనూ విస్తృతంగా సంప్రదింపులు జరపాలన్నారు. ఎన్నికలు సమీపించే సమయంలోనూ ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించేలా చూడడమే ఆయన ఉద్దేశమని సంబంధిత వర్గాలు తెలిపాయి.