దేశంలోనే అతిపెద్ద తీగలవంతెన 'సుదర్శన్ సేతు'..
దేశంలోని అతిపొడవైన తీగల వంతెన దేశప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ద్వారకాదీశ్ ఆలయ సందర్శనకు వచ్చే యాత్రికులకు ప్రయాణం సులభతరంగా ఉండేలా దీన్ని నిర్మించారు.. మొత్తం రూ.979 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈవంతెనను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. 2017 అక్టోబర్లో మోడీ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.2.3 కిలోమీటర్ల పొడవున్న దీనికి సుదర్శన్ సేతు అని పేరు పెట్టారు. ఇది ఓఖా ప్రాంతాన్ని బెట్ ద్వారకాతో అనుసంధానిస్తుంది. మొత్తం 27.20 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలతో నిర్మించిన ఈ బ్రిడ్జ్పై 2.5 మీటర్ల వెడల్పైన ఫుట్పాత్ కూడా ఉంది. దీనిపై రెండు వైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలు ఉంచారు.
ఈ వంతెనపై పలు చోట్ల సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసి ఒక మెగావాట్ విద్యుత్తు ఉత్పత్తి చేయనున్నారు. ద్వారకా పట్టణానికి ఓఖా పోర్టు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుదర్శన్ సేతు నిర్మాణానికి ముందు భేట్ ద్వారక చేరుకోవడానికి ప్రయాణికులు చాలా కష్టపడాల్సి వచ్చేది. పడవపైనే ఆధారపడేవారు. వాతావరణం ప్రతికూలంగా ఉంటే ప్రయాణానికి మరింత జాప్యం జరిగేది.
అయితే ఇప్పుడు ఈ ఐకానిక్ వంతెన నిర్మితం కావడంతో భక్తుల కష్టాల తీరనున్నాయి. అలాగే దేవభూమి ద్వారకలో మరో ప్రధాన పర్యాటక ఆకర్షణ అందరినీ అలరించనుంది. ఈ వంతెన డెక్.. మిశ్రమ ఉక్కు-రీన్ఫోర్స్డ్ కాంక్రీటుతో తయారయ్యింది. ఈ వంతెన మొత్తం పొడవు 2,320 మీటర్లు (7,612 అడుగులు). ఇది భారతదేశంలోనే అతి పొడవైన తీగల వంతెనగా నిలిచింది. ఈ వంతెన కారణంగా లక్షద్వీప్లో నివసిస్తున్న సుమారు 8,500 మందికి కూడా ప్రయోజనం చేకూరనుంది.