శక్తి వర్సెస్ శక్తి...
లోక్ సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ.. శక్తి అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారాన్ని రేపాయి. అధికారం అన్న అర్థం వచ్చే రీతిలో శక్తి అన్న పదాన్ని రాహుల్ ఉపయోగించగా, ఇది దుర్గాదేవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య అంటూ బీజేపీ విమర్శలు సంధించింది. సాక్షాత్తూ ప్రధాని మోడీ.. దీనిపై స్పందించడంతో విమర్శలు, ప్రతివిమర్శలు ప్రారంభమయ్యాయి. బీజేపీ విమర్శలకు ప్రతిస్పందించిన కాంగ్రెస్.. ప్రస్తుత ఎన్నికలు అసుర శక్తి అయిన బీజేపీ, దైవిక శక్తిని అయిన ఇండియా కూటమి మధ్య జరిగే పోరాటమని తెలిపింది. భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా ఆదివారం ముంబైలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తూ ఈడీ, సీబీఐ, ఐటీ, ఈవీఎంలు లేకుండా మోదీ ఎన్నికల వెళ్లలేరని, వాటిని దుర్వినియోగం చేస్తున్న ఆ శక్తికి వ్యతిరేకంగా పోరాడతామని అన్నారు. మోడీపై చేస్తున్న పోరాటం ఆయనపై వ్యక్తిగతంగా చేస్తున్నది కాదు. ఎందుకంటే ఆయన ఓ శక్తికి ముసుగు మాత్రమే అని విమర్శించారు.
అయితే శక్తి అన్న పదం దుర్గాదేవికి సంబంధించినది కావడంతో బీజేపీ ఆ కోణంలో విమర్శలు ప్రారంభించింది. సోమవారం జగిత్యాలలో మోడీ మాట్లాడుతూ.. వారు శక్తిపై పోరాటం చేస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టారు. నాకైతే ప్రతి తల్లి, చెల్లి శక్తి స్వరూపులే. నేను శక్తిని ఆరాధిస్తాను. నేను భారత మాత పూజారిని అని అన్నారు. శక్తిని నాశనం చేయాలనుకునేవారికి, శక్తి ఆరాధకులకు మధ్య పోరాటం జరుగుతోందని, శక్తి స్వరూపిణులైన మహిళలందరూ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
మోడీపై కాంగ్రెస్ ఫైర్
ప్రధాని వ్యాఖ్యలపై రాహుల్ ట్వీట్ చేస్తూ తన మాటలను వక్రీకరిచడానికి మోడీ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటారని ఆరోపించారు. తాను శక్తి గురించి చేసిన వ్యాఖ్యలు మోడీకి ఉన్న అధికారం గురించేనని స్పష్టం చేశారు. మోడీ అధికారానికి దేశ మీడియా రాత్రింబవళ్లు సెల్యూట్ చేస్తూ సత్యాన్ని అణచివేస్తోందన్నారు రాహుల్. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా స్పందిస్తూ.. పెడర్థాలు తీసి, ప్రజల దృష్టిని మళ్లించడంలో మోడీమాస్టర్ అని విమర్శించారు. రాహుల్ గాంధీ ..అసుర శక్తిపై దాడి ప్రారంభించగానే కంగారు పడ్డ ప్రధాని నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. మహిళా రెజర్లను బ్రిజ్భూషణ్ వేధించినప్పుడు ప్రధాని ఏ శక్తిని పూజించారు? కథువా, ఉన్నావ్, హత్రాస్ రేపిస్టులకు మద్దతుగా బీజేపీ శ్రేణులు ఊరేగింపులు జరిపినప్పుడు శక్తిని పూజించాలని మోడీకి గుర్తుకు రాలేదా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.
దేశంలో ఇన్ని సమస్యలు ఉండగా.. శక్తి అన్నపదాన్ని పట్టుకుని ప్రధానపార్టీలు రాజకీయంగా విమర్శలకు దిగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలు వాటి వైఖరి చెప్పాలి కానీ.. ఇలాంటి అనవసర ప్రాధాన్యమున్న అంశాలను హైలెట్ చేయకూడదంటున్నారు రాజనీతిజ్ఞులు. అందునా ప్రధాని హోదాలో ఉన్న మోడీ..వీటిని హైలెట్ చేసి, ప్రముఖంగా ప్రస్తావించడం సరికాదన్న భావనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల సెంటిమెంట్, భక్తిని .. ఇలాంటి చోట్ల మిళితం చేయడంపై విమర్శలు వస్తున్నాయి.