ఓటర్లు ఎవరి పక్షం ఉన్నారో తేలడానికి ఇక పక్షం రోజులే మిగిలింది..
ఆంధ్రాలో ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. ప్రచారాలు చేయడానికి గట్టిగా ఇంకా పక్షం రోజుల వ్యవధి కూడా లేదు. మే 11 సాయంత్రం నాలుగు గంటలకు అన్ని మైకుల నోళ్ళకి తాళాలు పడాల్సిందే. మాటల తూటాలు పేల్చే అవకాశం ఉండదు.. ఏం చెప్పాలన్నా.. ఏం చేయాలన్నా.. అభ్యర్థులకు ఉన్న టైం ఈ 15 రోజులు మాత్రమే. అందుకే అన్ని పార్టీలు ప్రచార జోరు పెంచాయి. జగన్ ఈనెల 28 నుంచి సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. రోజుకు మూడు సభలు అటెండ్ చేస్తూ ముందుకు పోవడానికి ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. ఇటుపక్క చంద్రబాబు అప్పుడే మూడు ఎన్నికల సభలను ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. మే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ కూటమి తరఫున ప్రచారానికి ఏపీకి రాబోతున్నారు.
అభ్యర్థుల గోల మాత్రం వినిపిస్తోంది కానీ ఓటర్లు ఎవరి పక్షం అన్నది మాత్రం కనిపించడం లేదు. ఏ పార్టీకి కావలసిన బలం ఆ పార్టీకి ఉంది.. ఎవరి బలగం వారి వెనక నడుస్తోంది. కానీ గెలుపు ఎవరిది అన్న విషయంపై ఇంతవరకు కాస్త కూడా స్పష్టత రాలేదు. జనాలు ఏ వైపు ఎడ్జ్ తీసుకోవాలో అర్థం కావడానికి మే మొదటి వారం పడుతుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలు కూడా క్లైమాక్స్ లో గేర్ మార్చి దూసుకుపోవడానికి మ్యానిఫెస్టోని అలాగే అట్టి పెట్టుకున్నారు. ఇప్పుడు టీడీపీ, వైసీపీ మేనిఫెస్టోలపై పెద్ద చర్చ జరుగుతుంది. రెండు పార్టీల చేతిలో ఉన్న తురుపు ముక్క.. ఎన్నికల ప్రణాళికలను మార్చగలిగే ఆయుధం ఈ మ్యానిఫెస్టో అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఈరోజు వైసీపీ మేనిఫెస్టో విడుదల కాబోతోంది.
ఇక టీడీపీ మేనిఫెస్టో ప్రధాని చేతుల మీద విడుదల చేస్తారు అని టాక్. అయితే ఇంకా దీనికి డేట్ ఫిక్స్ కాలేదు. ఈరోజు విడుదల అయ్యే వైసీపీ మేనిఫెస్టోలో లోసుగులను వెతికి తమ మేనిఫెస్టోని కట్టుదిట్టం చేయడానికి చంద్ర బాబు ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ మేనిఫెస్టోల మాయాజాలంలో ఓటర్లను ఇరికించడానికి అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మరి ఓటరు ఎవరి పక్షాన ఉన్నారో ఓ పక్షం రోజుల్లో తేలిపోతుంది. అప్పటిదాకా ఆగితే కానీ గెలుపు ఎవరితో తెలియదు.