డొనాల్డ్ ట్రంప్ కు షాక్ ఇచ్చిన న్యూయార్క్ కోర్టు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆస్తుల స్వాధీనానికి న్యూయార్క్ అటార్నీ జనరల్ చర్యలు మొదలుపెట్టారు. ఓ మోసం కేసులో 355 మిలియన్ డాలర్లు ( రూ.2,964 కోట్లు) దానిపై వడ్డీని చెల్లించాలని ఆయన్ను, ఆయన కుమారులు జూనియర్ ట్రంప్, ఎరిక్ ట్రంప్, ట్రంప్ ఆర్గనైజేషన్ను న్యూయార్క్ న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఈ మొత్తం 454 మిలియన్ డాలర్ల ( రూ.3,791 కోట్లు) కు చేరింది. చెల్లింపుల కోసం ట్రంప్ ఇప్పటివరకు ఎలాంటి యత్నం చేయకపోవడంతో అటార్నీ జనరల్ తదుపరి చర్యలు చేపట్టారు.
ఉత్తర మాన్హట్టన్లోని ఆయన ప్రైవేటు ఎస్టేట్ సెవన్ స్ప్రింగ్స్, గోల్ఫ్ కోర్సు స్వాధీనం చేసుకునే అవకాశాలున్నాయి. ఆస్తుల విలువపై ఏళ్ల తరబడి అసత్యాలు చెప్పి బ్యాంకులు, బీమా కంపెనీలను మోసం చేశారని న్యూయార్క్ న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసు ఓడిపోతే కచ్చితంగా అపరాధ రుసుం చెల్లించేలా గ్యారెంటీ మొత్తాన్ని ఇచ్చి తీరాలని వెల్లడించింది. మరో వైపు ఇది రాజ్యాంగ విరుద్ధమని ట్రంప్ అంటున్నారు.