అమిత్ షా భేటీపై కీలక విషయాలు .. వెల్లడించిన లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కేంద్ర హొం మంత్రి అమిత్ షాకు అన్ని విషయాలు వివరించానని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి కలవాలనుకుంటున్నట్టు కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. చంద్రబాబు అరెస్టు, అనంతర పరిణామాలపై హోం మంత్రి అమిత్ షాకు అన్ని విషయాలు వివరించా. చంద్రబాబు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పాను. ఆయనకు భద్రతా పరంగా ఉన్న ఆందోళన గురించి కూడా చెప్పాను. సీఐడీ ఎందుకు పిలిచింది. ఎన్ని కేసులు పెట్టారని అమిత్ షా అడిగారు. అన్నీ పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసులే అని అమిత్ షాకు చెప్పా. బీజేపీనే చేయిస్తోందని ఒక ఎంపీ, మంత్రి నేరుగా అన్నట్టు అమిత్ షాకు తెలిపాను. బీజేపీ పాత్ర ఉందని నేను అనుకోవట్లేదు. బీజేపీ నేతల మౌనంతో ఆరోపణలు వచ్చాయనుకుంటున్నా. నిజం వైపు ఉండాలని అమిత్ షాను కోరా. టీడీపీ ఎంపీలు ప్రధాని, హోం మంత్రికి లేఖలు రాశాను అని తెలిపారు.
రాష్ట్రంలో బీజేపీ పేరు చెప్పి కక్ష సాధిస్తున్నారని అమిత్ షా అన్నారు. చంద్రబాబు అరెస్టు వెనుక తాము లేమని అమిత్ షా స్పష్టంగా చెప్పారు. బీజేపీపై జగన్ నిందలు మోపుతున్నారని అన్నారు. అమిత్ షా వద్ద ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదు. రాష్ట్రం నుంచి అమిత్ షా సమాచారం తీసుకున్నట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అక్రమ కేసుపై వైసీపీ క్యాడర్లోనే అనుమానం ఉంది. స్కిల్ కేసు వెనుక ఏదో జరుగుతోంది. పది రోజులుగా ఈ కేసు విషయమై వైసీపీ మాట్లాడలేదు. నా తల్లి ఐటీ రిటర్న్లు సీఐడీ చేతికి ఎలా వచ్చాయి? ఈ అంశంపై సీబీడీటీకి ఫిర్యాదు చేస్తాం. ఎన్డీఏ, ఇండియా కూటములకు సమదూరంలోనే ఉన్నాం. దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీల నేతలను కలిశా. మేం సుప్రీంలో సవాల్ చేసిన 17ఏ అంశం చాలా కీలకం. 17ఏ ను పరిగణనలోకి తీసుకోకుంటే చాలా మంది ఇబ్బంది పడతారు అని లోకేశ్ తెలిపారు.