యువగళం పాదయాత్ర 'విజయోత్సవసభ'..
నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయోత్సవసభ సందర్భంగా విశాఖ, విజయనగరం జిల్లాలు పసుపుమయమయ్యాయి. యువగళం పాదయాత్ర విజయవంతం కావడంతో... టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది.మరోవైపు.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ఇద్దరూ ఒకేసారి వేదికగా కనిపించనుండడం ఆసక్తికరంగా మారింది. పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారైన నేపథ్యంలో వీరందరూ ఒకే వేదికపైకి వచ్చి ప్రసంగించనుండటం ఇరు పార్టీలకు, రాష్ట్ర భవిష్యత్తుకు కీలక మలుపు కానుందని ఆయా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఈ వేదికపై నుంచి ఇరు పార్టీల నేతలు ఉమ్మడిగా కీలక ప్రకటనలు చేసే అవకాశముంది.
200 ఎకరాల్లో ప్రాంగణం.. 6 లక్షల మందికి ఏర్పాట్లు యువగళం విజయోత్సవ సభ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకూ కొనసాగనుంది. సభకు 6 లక్షల మందికి పైగా వస్తారని టీడీపీ అంచనా వేస్తోంది. పోలిపల్లిలోని ఓ ప్రైవేటు లేఅవుట్లో 200 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. 600 మందికి పైగా ముఖ్య నాయకులు ఆసీనులయ్యేందుకు వీలుగా 156 అడుగుల వెడల్పు, 64 అడుగుల పొడవుతో భారీ సభా వేదికను నిర్మించారు. దూరంగా ఉన్నవారికి సైతం కనిపించేలా పెద్ద పెద్ద ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలోకి వచ్చేవారంతా కూర్చునేందుకు వీలుగా కుర్చీలు సిద్ధం చేశారు.
క్యూఆర్ కోడ్లతో కూడిన పాస్లు
చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణ, టీడీపీ, జనసేన ముఖ్యనాయకులు వేదికపై అగ్రభాగాన ఆసీనులు కానున్నారు. వీరితో పాటు ఇతర ఆహ్వానితులు క్యూఆర్ కోడ్లతో కూడిన పాస్లు ఇచ్చారు. ఆ కోడ్ను స్కాన్ చేసి వారిని సంబంధిత గ్యాలరీల్లోకి అనుమతిస్తారు. వేదికకు కుడివైపు తొలి వరుసలో నందమూరి, నారా కుటుంబసభ్యులు, వీవీఐపీలు, వీఐపీలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. రెండో వరుసలో యూనిట్ ఇన్ఛార్జులతోపాటు ప్రజలు కూర్చునేలా ప్రణాళిక రూపొందించారు.
250 ఎకరాల్లో పార్కింగ్కు ఏర్పాట్లు
పార్కింగ్ కోసం 250 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. అనంతపురం, చిత్తూరు ప్రాంతాల నుంచి వచ్చే వారికి రాజాపులోవ వద్ద, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల నుంచి వచ్చే వారికి వేదిక వెనుక వైపు కేటాయించారు. భోగాపురం నుంచి విశాఖపట్నం వరకు పసుపు జెండాలు, కటౌట్లతో ఆ మార్గమంతా పసుపుమయమైంది. విశాఖనగరంతో పాటు ఉత్తరాంధ్రలోని ప్రతి నియోజకవర్గంలోనూ భారీ స్థాయిలో హోర్డింగులు, కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. సభా ప్రాంగణంలో భారీగా పసుపు బెలూన్లు ఏర్పాటు చేశారు.