రాళ్ళ దాడులలో రికార్డు చంద్రబాబుదే..
శనివారం నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాళ్ళదాడి సంచలనంగా మారింది. ఆ తర్వాత వెంటనే ఆదివారం నాడు పవన్ కళ్యాణ్ పై, చంద్రబాబుపై కూడా రాళ్ళతో దాడి జరిగింది. ఎవరు ఎవరిపై దాడి చేయించుకున్నారు అన్న విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఇప్పటివరకు రాళ్ళదాడుల్లో రికార్డు ఎవరిది అంటే చంద్రబాబుదే అని చెప్పాలి. గత ఎడాది ఆగస్టులో తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో చంద్రబాబుపై రాళ్ళ దాడి జరిగింది. అప్పట్లో తనని చంపేటందుకు కుట్ర జరిగిందని చంద్రబాబు ఆగ్రహించారు కూడా. కానీ విచిత్రం ఏమిటంటే ఈ గొడవకంతా కారణం చంద్రబాబు అని పోలీసులు కేసు పెట్టారు. 2021 తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల ప్రచార సమయంలో కూడా బాబుపై ఇలాగే రాళ్ళ తో దాడి జరిగింది. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఆకతాయిలు అతనిపై రాళ్లు విసిరారు. గత ఏడాది ఏప్రిల్ లో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు వెళ్తున్న చంద్రబాబుని మంత్రి ఆదిమూలపు సురేశ్, అతని అనుచరులు అడ్డగించడానికి ట్రై చేశారు. ఈ సమయంలో కూడా కొందరు చంద్రబాబుపై రాళ్ళ తో దాడి చేశారు. 2022 బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నందిగామలో రోడ్ షో నిర్వహించారు. ఆ సందర్భంగా ఒక అజ్ఞాత వ్యక్తి చంద్రబాబుపై రాయి విసిరాడు. అయితే చంద్రబాబుకు గురితప్పిన ఆ రాయి పక్కనే ఉన్న భద్రతా సిబ్బందికి తగిలి అతని గాయపరిచింది. గత రెండు రోజుల్లో వరుసగా జరిగిన రాళ్ళ దాడులతో ఈ డేటా మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.