త్వరలోనే ఆర్ఆర్ఆర్ బృందానికి సన్మానం : మంత్రి తలసాని
తెలుగు చలనచిత్ర ఖ్యాతిని ఆర్ఆర్ఆర్ చిత్రం విశ్వవ్యాప్తం చేసిందని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ అవార్డు లభించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఆర్ఆర్ఆర్ బృందానికి సన్మానం చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఆస్కార్ అవార్డును అందుకున్న ఏకైక తెలుగు చలనచిత్రంగా ఆర్ఆర్ఆర్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల తెలుగు రాష్ట్రాలు, దేశం గర్వపడుతుందని తెలిపారు. ఆస్కార్ అందుకున్న గొప్ప చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రాన్ని నిర్మించిన డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియో గ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరపున అభినందనలు తెలిపారు.