రావణకాష్టంలా మణిపూర్..
మణిపూర్ రాష్ట్రంలో విధ్వంసం మొదలై నెలరోజులు దాటింది. మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న మొయిటీలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా జాతుల సమరం రేగింది. ఇప్పుడు అది ఎలా ఉందంటే.. మణిపూర్ ను తగులబెట్టేస్తోంది. ఇప్పటికే వందమందికిపై ఘర్షణల్లో చనిపోయారు. వేలాదిమంది ఆస్తులు, ఊళ్లను వదిలిపెట్టి, సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. సాక్షాత్తూ హోంమంత్రి అమిత్ షా మణిపూర్ లో బసచేసి, పరిస్థితి అదుపుచేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
ఇది ఆవేశంతో జరిగిన సంఘర్షణ కాస్తా.... తీవ్ర రూపు దాల్చింది. ఇందులోకి మిలిటెంట్లు రంగప్రవేశం చేశారు. పోలీస్ స్టేషన్లు, ఆర్మీ యూనిట్లపై దాడులు చేసి అత్యాధునిక వెపన్స్ ను ఎత్తుకెళ్లారు. ఇప్పుడా వెపన్స్ తో దాడులకు తెగబడుతున్నారు. దీంతో సామాన్యుడి ప్రాణానికి రక్షణ లేకుండా పోయింది. నిరసనకారుల రూపంలో మిలిటెంట్లు విరుచుకుపడుతున్న విషయాన్ని భద్రతాబలగాలు గుర్తించాయి. వారి ఏరివేతకు ప్రయత్నాలు చేస్తున్నా.. అవి అంతంతమాత్రంగానే ఉన్నాయి.
నిరసన సందర్భంగా కేంద్రబలగాలు వివిధ ప్రాంతాల్లోకి వెళ్లకుండా ముందస్తుగానే ఎక్కడికక్కడ రోడ్లు బ్లాక్ చేశారు. చాలాచోట్ల రోడ్లను తవ్వేశారు. ఇది మరింత ప్రమాదకరంగా పరిణమించింది. దీంతో భద్రతాబలగాలు హింసాత్మక ఘటనలు జరిగిన చోటుకు వెళ్లడానికి చాలా సమయం పడుతోంది. ఈలోగా ఉగ్రవాదులు, నిరసనకారులు .. ఆయా ప్రాంతాల్లో విధ్వంసం , రక్తపాతం సృష్టిస్తున్నారు. దీంతో ప్రజలకు కూడా పోలీసులు, భద్రతా బలగాలపై నమ్మకం పోయింది.
ఇది మణిపూర్ రాష్ట్రాన్ని అస్థిరపరిచే కుట్రగా కేంద్రం భావిస్తోంది. అయితే శాంతిభద్రతలు అదుపు తప్పడం, స్వయంగా ప్రజలే ఆయుధాలు చేతుల్లోకి తీసుకోవడంతో.. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే.. అరాచకం ప్రబలిపోవడంతో.. ఇప్పటికిప్పుడు శాంతి నెలకొల్పడం అసాధ్యంగా మారింది. ఇరువర్గాలతో కేంద్రం చర్చలు జరిపినా.. మూకదాడులు ఆగడం లేదు. అవి ఎంతగా మారాయంటే కేంద్రమంత్రి, రాష్ట్రమంత్రుల ఇళ్లపై దాడులు, నిప్పంటించేస్థాయికి చేరాయి.
సాదారణంగా దాడి అంటే పదిమందో, యాబై మందో వచ్చి దాడి చేసి విధ్వంసం సృష్టించి పోవడం కామన్ గా జరుగుతుంది. కానీ మణిపూర్ లో జరుగుతున్న దాడుల్లో వెయ్యిమంది గుంపులుగా వచ్చి దాడులు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అంతమందిని అదుపుచేయడం కష్టంగా మారుతోందంటున్నారు. ఫలితంగా యథేచ్ఛగా దాడుల పర్వం సాగుతోంది. మరి ఇప్పుడు మణిపూర్ లో శాంతిసుమాలు వికసింపజేయడానికి ఎన్నాళ్లు పడుతుందో అన్నది అందరిని భయపెడుతోంది.