మతాన్ని రాజకీయంగా మారుస్తున్న నేతలు.. పదవి కోసం ఇంత అవసరమా?
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికల హడావిడి కనిపిస్తూనే ఉంది. మరి ముఖ్యంగా నార్త్ లో లోక్ సభ ఎన్నికల సందర్భంగా పెద్ద పార్టీలు ఒకదానిపై ఒకటి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. ఇంతవరకు అంతా బాగానే ఉంది కానీ మధ్యలోకి మతాన్ని తీసుకువచ్చి ప్రజలను మత్తెక్కించాలి అనుకుంటున్నారు. అయితే ఇది భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకి దారితీస్తుంది అంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోని లక్ష్యంగా పెట్టుకొని ఉత్తరప్రదేశ్ సీఎం..యోగి ఆదిత్యనాథ్ మరొకసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గోమాంసం వినియోగం అనుమతిస్తుంది అంటూ ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు గొడ్డు మాంసం తినే హక్కును కల్పించాలని భావిస్తోంది అని వారు ఆరోపిస్తున్నారు. మరోపక్క ఉత్తర ప్రదేశ్ లో జంతు వధకు సంబంధించి ఇప్పటికి కూడా కఠినమైన చట్టాలు ఉన్నాయని.. 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష.. ఐదు లక్షల వరకు జరిమానా విధించే అవకాశం కూడా ఉందని ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం చాలా సున్నితమైనటువంటి ఈ అంశాన్ని తీసుకువచ్చి ఇలా రాజకీయానికి జోడించడం భవిష్యత్తులో అలజడులకి కారణమైతే? ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకులు ప్రజల కోసం చేసే మంచి గురించి మాట్లాడితే బాగుంటుంది కానీ మతం అనే మత్తులో ప్రజలను ముంచి ఓట్లు రాబట్టుకోవాలి అనుకోవడం మంచిది కాదు అన్న వాదన గట్టిగా వినిపిస్తోంది.