నేను పెయిడ్ ఆర్టిస్ట్ ని కాదు.. కావాలంటే నార్కో టెస్ట్ చేసుకోండి.. పోసాని..
నటుడు, రచయిత, ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి మెగా ఫ్యామిలీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తో విభేదించినంత మాత్రాన తనకు సినిమాల్లో అవకాశాలు తగ్గలేదు అన్న పోసాని.. తెలుగు సినీ ఇండస్ట్రీ ఏమైనా మెగా ఫ్యామిలీ చేతిలో ఉందా అంటూ ప్రశ్నించారు. నిజంగా సినీ ఇండస్ట్రీపై మెగా ఫ్యామిలీ ప్రభావమే ఉంటే.. వాళ్ళే ఎందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో నిలబడలేదు అని ప్రశ్నించారు. అంతేకాదు నిజంగా మెగా ఫ్యామిలీకి ప్రజల అభిమానం అండగా ఉంటే పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాలలో ఎందుకు ఓడిపోయారు అని ఆయన ప్రశ్నించారు. తాను పెయిడ్ ఆర్టిస్టుని కాదని.. డబ్బులు తీసుకొని ప్రెస్ మీట్ లు పెట్టాల్సిన అవసరం తనకు లేదని పోసాని స్పష్టం చేశారు. గత 15 ఏళ్లుగా తన ప్రెస్ మీట్ లు పెడుతున్నానని.. ఒక ప్రెస్ మీట్ కూడా డబ్బు తీసుకున్న దాఖలాలు లేవని ఆయన అన్నారు. అనుమానాలు ఉంటే తనకు నార్కో టెస్ట్ కూడా చేసుకోవచ్చని సవాల్ విసిరారు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు.. ప్రజల బాగుకోరే మనిషి గెలవాలి అని కోరుకోవాలి తప్ప.. మా వాడే గెలవాలి, మా కులం వాడే గెలవాలి అని భావించడం కరెక్ట్ కాదని పోసాని చెప్పారు. చంద్రబాబు లాంటి వ్యక్తి వల్ల సమాజం పాడైపోతోందని పోసాని అన్నారు. ఒకవేళ ఓడిపోయిన జగన్ వైపే తాను ఉండడానికి ఇష్టపడతాను తప్ప మాట మార్చేది లేదని స్పష్టం చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని.. ఎవరికి ఓటు వేయాలి అన్న విషయం పై వారికి స్పష్టత ఉందని.. ఈసారి కూడా జగన్ సర్కారే గెలుస్తుందని పోసాని ధీమా వ్యక్తం చేశారు.