సైనిక్ స్కూల్స్ పైనా రాజకీయాలా..?
దేశంలోని సైనిక్ స్కూల్స్ ప్రైవైటీకరించాలన్న యోచనను కేంద్రం విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ప్రైవేటీకరణకు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలను రద్దు చేయాలని, ఆ విధానాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని కోరారు. దీనివల్ల సైనిక దళాలపైనా రాజకీయముద్ర పడుతుందని.. ఫలితంగా రక్షణరంగం రాజకీయ వేదికగా మారేప్రమాదముందన్నారు.
రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని స్వతంత్ర సంస్థ ద్వారా దేశంలో 33 సైనిక్ స్కూళ్లు పనిచేస్తున్నాయి. ఇంతవరకు సైనిక దళాలు, వాటి అనుబంధ సంస్థలు రాజకీయాలకు దూరంగా ఉన్నాయి. ప్రైవేటీకరిస్తే వాటి స్వభావంపై ప్రభావం పడుతుంది. ఒక సిద్ధాంతాన్ని వీటి ద్వారా విద్యార్థులపై రుద్దేందుకు ప్రయత్నించడం తగదు. దేశ సేవకు కావాల్సిన లక్షణాలను, దార్శనికతను ఈ పాఠశాలల్లోని విద్యార్థులు నిలుపుకోవాలంటే ప్రైవేటీకరణ ఒప్పందాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలి. లేదంటే 62% పాఠశాలల్ని బీజేపీ-ఆరెస్సెస్ నేతలే సొంతం చేసుకోనున్నారు’’ అని ఖర్గే తన లేఖలో తెలిపారు.
ఈ ఆరోపణలను రక్షణ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ‘‘ఏ రాజకీయ, సైద్ధాంతిక సంస్థలు ఈ ఎంపిక ప్రక్రియను ప్రభావితం చేయవు. దీనికి సంబంధించి వచ్చిన ఆరోపణలు అసంబద్ధమైనవి. తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయి’’ అని ఖండించింది. విద్యారంగంలో అనుభవం ఉన్న సంస్థలతో 100 పాఠశాలలను ఏర్పాటు చేసే పథకాన్ని కేంద్రం ప్రారంభించిందని తెలిపింది. కఠినమైన ఎంపిక ప్రక్రియ ద్వారా 500 దరఖాస్తులను స్కాన్ చేయగా.. 45 పాఠశాలలకు మాత్రమే ఆమోదం లభించిందని పేర్కొంది. అది కూడా తాత్కాలికమేనని, వాటిపై పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించింది.
రాజకీయాలు అన్నిరంగాల్లోనూ వేలుపెడుతున్నాయి. ఇప్పుడు రక్షణమంత్రిత్వశాఖ పరిధిలోని సైనిక్ స్కూల్స్ కూడా రాజకీయ జోక్యానికి బలవుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు సాక్షాత్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ఇవి నిజం కాదని కేంద్రం చెబుతోంది. మరి ఇవి నిజమైనవి కాదంటే.. ఖర్గే లాంటి సీనియర్లు సైతం తమ దగ్గరకు వచ్చే అంశాలపై క్లారిటీ పెంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేకుండా ఇంత తీవ్రమైన ఆరోపణలు చేయడం సమంజసం కాదని రక్షణ వర్గాలు చెబుతున్నాయి.