ఎన్నారై పైలా ప్రసాదరావుకు మాడుగుల సీటు ఖరారు
మాడుగుల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పైలా ప్రసాదరావు పేరును అధినేత చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. ఎన్ఆర్ఐ అయిన పైలా ప్రసాదరావు 2009లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీకి 13 ఏళ్లుగా ఎనలేని సేవలు అందిస్తూ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేస్తూ నియోజకవర్గంలో బలమైన టీడీపీ నాయకునిగా గుర్తింపు తెచ్చుకున్న పైలా ప్రసాదరావుకు మాడుగుల నియోజకర్గ కూటమి అభ్యర్థిగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడంపై నియోజకవర్గంలో తెలుగు తముళ్లు హర్షం వ్యక్తం చేస్తూన్నారు. ఈ టికెట్ కోసం ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ పివిజి కుమార్, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుపై పార్టీ అధిష్టానం చేసిన ఆరు సర్వేల్లో కూడా వీరికి ప్రజా మద్దతు లభించలేదు. సర్వేల ఆధారంగా చంద్రబాబు నాయుడు, పైలాకే టికెట్ కేటాయించారు.
2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు ఏపీ జన్మభూమి రాష్ట్ర కమిటిలో కీలక బాధ్యతలు పైలా చేపట్టారు. నియోజకవర్గంలో ఆలయాలు నిర్మాణానికి, యువవతను క్రీడల్లో ప్రోత్సహించడానికి 13 ఏళ్లుగా ఆయన సొంత నిధులు వెచ్చించారు. అలాగే పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. పార్టీ అధిష్ఠానం ఆదేశించిన అన్ని కార్యక్రమాల్లో పైలా తనదైన ముద్ర వేసుకున్నారు. విద్యావంతుడు, సౌమ్యుడుగా పైలాకు ఈ ప్రాంతంలో మంచి పేరుంది. పైలాను ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయకుడు ప్రకటించడంతో నియోజకవర్గ పార్టీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. జనసేన, బీజేపీ పార్టీ నాయకులు కూడా పైలాకు టికెట్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.