ఎందుకొచ్చింది ..ఏం తెచ్చింది.. పోలీసులను ప్రశ్నిస్తున్న లోకేష్..
ఆంధ్రాలో ఈసారి ఎన్నికల రచ్చ మామూలుగా లేదు. ఎక్కడ ఏ చిన్న పాయింట్ దొరికిన వదలకుండా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రోజు తాను ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నప్పుడు కాన్వాయ్ ని తనిఖీ చేస్తున్న పోలీసులు జగన్ విషయంలో మౌనంగా ఎందుకు ఉంటున్నారు అని లోకేష్ ప్రశ్నిస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత కొద్దికాలంగా బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ అనే ప్రోగ్రాం ని నిర్వహిస్తున్నారు. తాను ప్రోగ్రాం కోసం వెళ్తున్న సమయంలో సెక్యూరిటీ సిబ్బంది అతని వాహనాలను ఆపి మరీ తనిఖీ చేస్తున్నారు. అయితే మరోపక్క పెద్ద కంటైనర్ రాంగ్ రూట్ ఫాలో అవుతూ.. సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్తున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని ఉన్నారు అని నారా లోకేష్ అంటున్నారు. ఆ కంటైనర్ లో.. ఏం తెస్తున్నారు.. ఇవి ఎన్నికల నిబంధన ఉల్లంఘన కాదా అని అతను పోలీసులను ప్రశ్నిస్తున్నారు. కంటైనర్లు ఎందుకు తనిఖీ చేయడం లేదో వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు అందులో ఉండేది లిక్కర్, డ్రగ్స్ లాంటి సరుకా.. లేక డబ్బా.. అది కాకపోతే లండన్ పారిపోవడానికి సీఎం చేసుకునే ఏర్పాట్ల హడావిడా..? ఏం జరుగుతోందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని.. ఈ విషయంపై ఎన్నికల సంఘం కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.