ఆ ఛానల్స్ పై కేటీఆర్ పరువు నష్టం దావా.. అసలు సంగతి అదే..
సోషల్ మీడియా ఎక్కువగా పాపులర్ అయ్యాక ఏది వాస్తవము? ఏది అవాస్తవము? అన్న విషయాలపై ప్రజలకు క్లారిటీ లేకుండా పోతోంది. కొన్నిసార్లు అసత్యాలను కూడా ఎక్కువగా పబ్లిసిటీ ఇచ్చి సత్యాలుగా మార్చడానికి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ప్రయత్నించిన సందర్భాలు మనం గమనిస్తున్నాం. ఇదే విషయాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ ప్రస్తావిస్తున్నారు. డబ్బులకు ఆశపడి కావాలని తన పై, తన పార్టీపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై ఆయన ధ్వజమెత్తారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన కొన్ని చానల్స్ ఎటువంటి ఆధారాలు లేకుండా అడ్డగోలు అసత్యాలను తమపై ప్రచారం చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. అధికార పార్టీ ఇస్తున్న డబ్బులకు లోబడి వీరు ఈ పని చేస్తున్నట్టు ఆయన విమర్శించారు. ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా థంబ్ నెయిల్స్ డిజైన్ చేసి.. తమ పేరుతో పచ్చి అబద్దాలను చూపిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఇటువంటి కుట్రపూరిత రాజకీయాలు రాష్ట్రానికి మంచిది కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటువంటి చర్యలను సహించేది లేదని.. వీరిపై చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా అదేపనిగా తమను టార్గెట్ చేసి దుష్ప్రచారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం దావా కూడా వేయబోతున్నట్లు స్పష్ఠీకరించారు.