పాపం బీఆర్ఎస్..! బీఎస్పీతో పొత్తు..!!
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎప్పుడైనా.. ఏదైనా జరగొచ్చు. ఒక్క ఓటమి మేరునగధీరులను సైతం అథఃపాతాళానికి తీసుకెళ్తుంది. ఒక విజయం సామాన్యుడిని సింహాసనంపైన కూర్చోబెడుతుంది. ఇప్పుడు కేసీఆర్ కు మొదటిది వర్తిస్తుంది. పదేళ్లపాటు అప్రతిహతంగా సాగిన ఆయన విజయాల పరంపర ఒక్క ఓటమితో ఆయన ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. పక్కచూపులు చూసేలా చేస్తోంది. పార్లమెంటు ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి.
ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తిగా కేసీఆర్ తెలంగాణ పితగా పిలవబడుతున్నారు. అదే ప్రేమతో ఆయనకు పదేళ్లపాటు అధికారం కట్టబెట్టారు ప్రజలు. తాజా ఎన్నికల్లో మాత్రం ఆయన ఏమాత్రం ఊహించని పరాజయాన్ని చవిచూశారు. కేసీఆర్ పరిపాలనకు ప్రజలు ఓటేయలేదు. దీంతో ఆయన పార్టీ చిక్కుల్లో పడింది. కేడర్ మొత్తం చిన్నాభిన్నమైపోతోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి మూడు నెలలు కాలేదు. అప్పుడే నేతలు పక్క చూపులు చూస్తున్నారు. గెలిచిన నేతలు కూడా అంటీముట్టనట్టే ఉంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి కాస్తయినా ఊరట లభించాలంటే పార్లమెంటు ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థానాలైనా సాధించుకోవాలి. అందుకు కేసీఆర్ తీవ్రంగానే శ్రమిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ఎన్నికల సమయానికి ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో తెలియని పరిస్థితి. ఒకవైపు కేడర్ ను కాపాడుకుంటూ మరోవైపు ఎన్నికలను ఎదుర్కోవడం అనేది ఆషామాషీ విషయం కాదు.
ఒంటరిగా వెళ్తే కష్టమనుకున్నారో ఏమో ఇప్పుడు పొత్తులకు సిద్ధమవుతున్నారు కేసీఆర్. తెలంగాణలో బీఎస్పీకి పెద్దగా ప్రభావం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 107 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేదు. కేవలం 1.37 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినా ఆ పార్టీతో కలిసి పని చేయాలని నిర్ణయించారు. ఆ పార్టీ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తో కేసీఆర్ ఈ మేరకు చర్చలు జరిపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ కమ్యూనిస్టులతో స్నేహం చేసిన కేసీఆర్.. అప్పుడు పట్టించుకోలేదు. దీంతో వాళ్లు కూడా దూరమయ్యారు. ఇప్పుడు వాళ్లు ఇండియా కూటమిలో సభ్యులుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు బీఎస్పీ మాత్రమే బీఆర్ఎస్ కు దిక్కు.