యాత్రతో సీఎం వెన్నులో వణుకు.. అందుకే దొంగ కేసులు: జైరాం రమేష్
ఈశాన్య రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’పై అసోంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ యాత్రకు అనుమతించిన దారిలో వెళ్లకుండా సడెన్గా రూట్ మార్చారని, దీనికితోడు యాత్ర నిర్వాహకులు, సహనిర్వాహకులు ట్రాఫిక్ బారికేడ్లను బద్దలు కొట్టేలా ప్రజలను రెచ్చగొట్టారని పోలీసులు అసోం పోలీసులు పేర్కొన్నారు. అయితే తాము అలాంటి పనులేమీ చేయలేదని, కావాలనే అసోం ప్రభుత్వం ఇలా తమ యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ విభాగం జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ అన్నారు. ఈ యాత్ర అసోంలో ప్రవేశిస్తే అక్కడి బీజేపీ సీఎం హిమంత బిస్వ శర్మ అక్రమాలు ఎండగడతామని, అందుకే ఆ సీఎం వెన్నులో వణుకు పుడుతోందని జైరాం రమేష్ చెప్పారు. ఈ కారణంగానే ఎలాగైనా యాత్రను అడ్డుకోవాలని హిమంత శర్మ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అయితే ఏం జరిగినా సరే తమ యాత్ర ముందుకే సాగుతుందని, ఎవరూ దీన్ని అడ్డుకోలేరని కాంగ్రెస్ మరో నేత కేసీ వేణుగోపాల్ కూడా స్పష్టం చేశారు. ఎవరి మీదనైనా కేసులు వేసుకోవాలని, అరెస్టులు కూడా చేసుకోవాలని ఆయన చెప్పారు. అయినా సరే యాత్ర మాత్రం ఆగదని తేల్చిచెప్పారు.