కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా.. 31న ఇండియా కూటమి ‘మెగా మార్చ్’
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఇండియా కూటమి పార్టీలన్నీ కలిసి మెగా మార్చ్ నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 31న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఈ మెగా మార్చ్ నిర్వహించబోతున్నామని, అలాగే కేజ్రీవాల్కు సంఘీభావంగా భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తామని విపక్ష ఇండియా కూటమి ప్రకటించింది.
కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో పాటు ఇతర ఇండియా కూటమి పార్టీలు కలిసి ఆదివారం ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ క్రమంలోనే ఆప్ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉపయోగించి రాజకీయ నాయకులను బెదిరిస్తోందని, తద్వారా విపక్షాల అడ్డు తొలగించేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ఝార్ఖండ్లో హేమంత్ సోరెన్, బిహార్లో తేజస్వి యాదవ్లపై తప్పుడు కేసులు పెట్టారు. కేజ్రీవాల్ కుటుంబాన్ని గృహ నిర్బంధం చేయడంతోపాటు, ఆప్ కార్యాలయాన్నీ సీజ్ చేశారు. దేశంలో ప్రతిపక్షాలే లేకుండా చేయడమే కేంద్రం లక్ష్యం’’ అంటూ గోపాల్ రాయ్ మోదీ సర్కార్పై నిప్పులు చెరిగారు. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరవింద్ సింగ్ లవ్లీ మాట్లాడుతూ.. సీఎంలను అరెస్టు చేయడం, ప్రతిపక్షాల ఖాతాలను నిలిపివేయడం ఎలా ప్రజాస్వామ్యం అవుతుందని ప్రశ్నించారు. కేంద్ర నిరంకుశ తీరుకు వ్యతిరేకంగా కేంద్ర విపక్ష పార్టీలన్నీ కలిసి పోరాడతాయని తేల్చి చెప్పారు.