లోక్సభలోకి దూసుకొచ్చిన దుండగులు.. పార్లమెంటు వాయిదా
భారత పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగిన 22 ఏళ్ల తర్వాత మరోసారి లోక్ సభలో అలజడి రేగింది. 2001లో పార్లమెంటుపై దాడి గురించి మాట్లాడిన కాసేపటికే.. ఇద్దరు యువకులు లోక్ సభలోకి దూసుకురావడం గమనార్హం. విజిటర్ గ్యాలరీ నుంచి సడెన్గా హౌస్లోకి దూకిన యువకుల్లో ఒకరు స్పీకర్ వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించగా.. మరొకరు పసుపు రంగు గ్యాస్ క్యానిస్టర్ను పార్లమెంటులో విడుదల చేశారు. ఈ సమయంలో పార్లమెంటులోని కొందరు ఎంపీలు ధైర్యంగా ముందుకు వచ్చి స్పీకర్ వైపు దూసుకెళ్తున్న దుండగుడిని పట్టుకున్నారు. వీరిద్దరే కాకుండా పార్లమెంటు బయట మరో ఇద్దరు కూడా ఇలాగే గ్యాస్ క్యానిస్టర్తో కనిపించారు. వారిని కూడా ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో లోక్సభను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు ఈ విషయంపై చర్చించేందుకు ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు.