గూగుల్ కీలక ప్రకటన.. ఆ కంపెనీలకు వార్నింగ్
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, భారత్లోని యాప్ డెవలపర్ల మధ్య కొంతకాలం ప్లే స్టోర్ ఛార్జీ వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే గూగుల్ కీలక ప్రకటన చేసింది. కొన్ని కంపెనీలు సర్వీసు ఛార్జీలు చెల్లించకుండా తమ బిల్లింగ్ నిబంధనలను పదే పదే ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించింది. అలాంటి వాటిపై విధానపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే తమ ప్లే స్టోర్ నుంచి వాటిని తొలగిస్తామని హెచ్చరించింది. భారత్లో 2 లక్షలకు పైగా డెవలపర్లు మా గూగుల్ ప్లే ను వినియోగిస్తున్నారు. వీరంతా మా పాలసీలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. 10 కంపెనీలు మాత్రం కొంతకాలంగా గూగుల్ ప్లేలో మేం అందిస్తున్న సర్వీసులకు ఛార్జీలు చెల్లించడం లేదు. ఇందులో ప్రముఖ స్టార్టప్లు కూడా ఉన్నాయి. కోర్టు నుంచి మధ్యంతర రక్షణ పొందుతూ ఈ కంపెనీలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి అని గూగుల్ ఆరోపించింది. మిగతా ప్లే స్టోర్లకు మాత్రం యథావిధిగా ఛార్జీలు కడుతున్నాయి. మా పాలసీ నిబంధనలను ఉల్లంఘించే కంపెనీలపై చర్యలు తీసుకుంటాం. అవసరమైతే వాటి యాప్లను స్టోర్ నుంచి తొలగిస్తాం అని గూగుల్ హెచ్చరించింది. అయితే ఆ కంపెనీల పేర్లను మాత్రం వెల్లడించలేదు.