మళ్లీ 100 బిలియన్ డాలర్ల క్లబ్ లో గౌతమ్ అదానీ
ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ అదానీ మళ్లీ 100 బిలియన్ డాలర్ల సంపద కలిగిన ధనవంతుల జాబితాలో చేరారు. గత సంవత్సరం హిండెన్బర్గ్ నివేదిక తరువాత ఆయన సంపద గణనీయంగా తగ్గిపోయింది. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ జాబితాలో 101 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ ప్రస్తుతం 12వ స్థానంలోకి వచ్చారు. కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు భారీగా లాభపడ్డాయి. దీంతో ఆయన సంపద పెరిగింది. 2022లో హిండెన్బర్గ్ నివేదికకు ముందు ఆయన సంపద 150 బిలియన్ డాలర్లుగా ఉంది. నివేదిక తరువాత కంపెనీల షేర్లు భారీగా పతనం కావడంతో ఆయన సంపద 37.7 బిలియన్ డాలర్లకు పడిపోయింది. బ్లూమ్బర్గ్ నివేదికలో తొలి 25 మందిలో ఆయన స్థానం కోల్పోయారు.
హిండెన్బర్గ్ నివేదికను తోసిపుచ్చిన అదానీ ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపేందుకు అదానీ గ్రూప్ అనేక ప్రయత్నాలు చేసింది. సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ హిండెన్బర్గ్ ఆరోపణలకు ఆధారాలు లభించలేదని తెలిపింది. సెబీ ఈ ఆరోపణల్లో 22 అంశాల్లో దర్యాప్తు పూర్తి చేసింది. మరో రెండు అంశాలపై విచారణ కొనసాగుతున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇలా అదానీ గ్రూప్ పట్ల సానుకూల అంశాలు రావడంతో మార్కెట్లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే గౌతమ్ అదానీ సంపద పెరిగింది.