మరింత ఉధృతంగా రైతు ఉద్యమం..
డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు కర్షకులు. కేంద్రం ప్రకటిస్తున్న వరాలు కంటితుడుపు చర్యలుగా భావిస్తున్న యునైటెడ్ కిసాన్ మోర్చా.. ఉద్యమాన్ని తీవ్రతరం చేసేలా నిర్ణయాలు తీసుకుంది. ఫిబ్రవరి 26న హైవేకి ఒకవైపు ట్రాక్టర్ మార్చ్ను నిర్వహించనున్నారు. మార్చి 14న ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో ర్యాలీ తీయనున్నారు రైతులు. ఈ క్రమంలోనే 26 నుంచి 29 వరకు జరగనున్న డబ్ల్యూటీవో సమావేశానికి కూడా వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేయనున్నారు. ఉద్యమపథంలో సాగుతున్న తమతో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం.. రైతులను ఆగ్రహానికి గురి చేస్తోంది.
ఓవైపు అన్నదాతలతో చర్చిస్తామంటూనే కేంద్రం.. ఉక్కుపాదం మోపుతోందని రైతులు మండిపడుతున్నారు. హర్యానా పోలీసులు తమ ట్రాక్టర్లను పగులగొట్టారని... ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని రైతుసంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో ఓ యువకుని బలిదానం అంశాన్ని వారు ప్రస్తావించారు. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, దేశ హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలను దేశవ్యాప్తంగా దహనం చేస్తామని రైతు ప్రతినిధులు తెలిపారు.
ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ దాదాపు 5 మంది వివిధకారణాలతో చనిపోయినట్లు తెలుస్తోంది. ఎస్కేఎంతో ఉన్న పాత రైతు సంఘాల మధ్య ఐక్యతను పెంచేందుకు రైతు సంఘ నేతలు కృషి చేస్తామన్నారు. వీటన్నింటితో పాటు పంజాబ్-హర్యానా సరిహద్దులో హత్యకు గురైన యువకులకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. హనన్ మౌలా, ఉగ్ర, రమీంద్ర పాటియాలా, దర్శన్పాల్, రాజేవాల్లతో కూడిన ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కిసాన్ మోర్చా వెల్లడించింది.
సమస్యలు పరిష్కారం కోసం శాంతియుతంగా చలో ఢిల్లీకి ర్యాలీ తీయాలని తాము ప్రయత్నిస్తుంటే.. కేంద్రం అడ్డుకుంటోందని రైతులు మండిపడుతున్నారు. అయితే తమ డిమాండ్లు పరిష్కరించాలని, లేదంటే ఢిల్లీ వరకూ ర్యాలీకి అనుమతించాలని కోరుతున్నారు.అయితే త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో.. ఈపరిస్థితుల్లో రైతుల ఉద్యమం ఎక్కడకు దారితీస్తుందో అన్న ఆందోళన కేంద్రంలోనూ కనిపిస్తోంది.