న్యూయార్క్ టైం స్క్వేర్లో దీపావళి వేడుకలకు ముమ్మరంగా ఏర్పాట్లు!
ప్రఖ్యాత న్యూయార్క్ టైం స్క్వేర్లో దీపావళి వేడుకలు నిర్వహించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. న్యూయార్క్లోని భారత కాన్సులేట్, ఏఆర్ హెల్పింగ్ హ్యాండ్స్, దివాలీ ఎట్ టైంస్క్వేర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కలిసి ఈ వేడుకలు ఎలా నిర్వహిస్తారనే వివరాలను సెప్టెంబర్ 15న వెల్లడించనున్నారు. కాన్సులేట్లోని బాల్రూంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరగనుంది. న్యూయార్క్ నగరంలో దీపావళిని స్కూల్ హాలీడేగా ప్రకటించడంలో కీలక పాత్ర పోషించిన నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్, న్యూయార్క్లో కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా, అసెంబ్లీవుమెన్ జెన్నిఫర్ రాజ్కుమార్తోపాటు దివాలీ ఎట్ టైం స్క్వేర్ బోర్డు సభ్యులంతా కలిసి ‘దివాలీ ఎన్వైసీ అఫీషియల్ హాలీడే’ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకోనున్నారు.
‘యునైటెడ్ కలర్స్ ఆఫ్ అమెరికా’ అనే థీంతో ఈ వేడుకలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ వేడుక ద్వారా ప్రేమ, జీవితం అనే వెలుగులను ప్రపంచం అంతా పంచాలని అనుకుంటున్నామని, అలాగే వివక్ష, అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలాలని భావిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. అక్టోబర్ 28న టైం స్క్వేర్లో దీపావళి వేడుకలు జరగనున్నాయి. ఈ కమిటీలో నీతా భాసిన్, నరేష్ కుమార్, డాక్టర్ దత్తాత్రేయుడు నోరి, డాక్టర్ భారత్ బారాయి, డాక్టర్ రాజ్ భయానీ, రవి పులి, మన్మధన్ నాయర్, యోగి చుగ్, సుందర్ అద్వానీ, బీనా కొఠారి, రాజేంద్ర దిచపల్లి, జాన్ ఐజాక్, లవ్ మలోన్, సంతోష్ పెద్ది, ఓంకార్ సింగ్ ఉన్నారు.